వనపర్తి: ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని ఉద్యోగార్థులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో ఉచిత శిక్షణ తీసుకుంటున్న 400 మంది అభ్యర్థులకు సోమవారం ఆయన వనపర్తి జిల్లా ఇన్చార్జి ఎస్పీ జే రంజన్రతన్కుమార్తో కలిసి ఉచిత మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఈ 60 రోజుల శిక్షణ పూర్తయితే.. మీరు మొదటి ఎక్కినట్లే అని.. మీకు ఒక బలమైన సంకల్పం ఏర్పడిందని అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు. ఉద్యోగాలు రానివారు నిరాశ చెందొద్దని, మీరు జీవితంలో స్థిరపడే వరకు వదిలిపెట్టబోన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్, ఇతర ఉద్యోగాలు సాధించేందుకు తాము సహకారమందిస్తామని చెప్పారు.
తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకునేవారికి తాము అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. శిక్షణ తీసుకున్నవారందరూ ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం తనకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివి సివిల్స్ సాధించారని, ఆయనలాంటివారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తాత్కాలిక ఆనందాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటే శాశ్వతంగా సంతోషంగా ఉండే ఫలితాలు వస్తాయని తెలిపారు. మీరు ఉద్యోగం సాధించడమే తమకిచ్చే బహుమానమని శిక్షణ తీసుకున్న అభ్యర్థుల గురించి వ్యాఖ్యానించారు. అనంతరం ఎస్పీ రంజన్రతన్కుమార్ అభ్యర్థులకు పలు సూచనలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి డీఎస్పీ ఆనంద్రెడ్డి, వనపర్తి సీఐ ప్రవీణ్కుమార్, కొత్తకోట సీఐ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పీజేఈఆర్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు జగదీశ్వర్రెడ్డి, వనపర్తి పట్టణ ఎస్ఐ యుగంధర్రెడ్డి, వనపర్తి రూరల్ ఎస్ఐ చంద్రమోహన్, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.