ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందావనాన్ని తలపిస్తున్నది. ప్రకృతి అందాల నడుమ రోగులకు సేవలందిస్తున్నది. చుట్టూ పచ్చని చెట్లు.. రకరకాల పూల మొక్కలు.. ఆహ్లాదకర వాతావరణం దవాఖానకు వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నది. రోగులకు అందిస్తున్న వైద్యసేవలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో గుర్తింపు పొందింది దుబ్బాక మండలం తిమ్మాపూర్ పీహెచ్సీ.
దుబ్బాక, సెప్టెంబర్ 7 : చుట్టూ పచ్చని చెట్లు.. పక్షుల కిలకిల రాగాలు.. మరో పక్క స్వాగతం పలికే రకరకల పూలతో దుబ్బాక మండలం తిమ్మాపూర్ పీహెచ్సీ బృందావనాన్ని తలపిస్తున్నది. ఆహ్లాదకర వాతావరణంలో రోగులకు సేవలందిస్తున్నది. మంచి వాతావరణంతోనే రోగాలు సగం తగ్గుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఉత్తమ సేవలకు వైద్యశాల అనేక జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
దుబ్బాక మండలం తిమ్మాపూర్ పీహెచ్సీ(ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం)లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలకు గాను జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. దవాఖానలో వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలందించడమే గాక గ్రామీణులకు వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నది. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. గర్భిణులకు నెలనెలా వైద్య పరీక్షలు చేయించి, మందులు ఇస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ప్రజల ఆరోగ్య వివరాలను ఓ పట్టిక రూపంలో పొందుపరిచి, వైద్య సేవలందిస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో వైద్య సేవలు
20ఏండ్ల క్రితం దుబ్బాకలో కేవలం సామాజిక ఆరోగ్యకేంద్రమే ఉండేది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల వారికి సామాజిక ఆరోగ్యకేంద్రంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. రాత్రివేళలో ఆరోగ్యకరమైన సమస్యలుంటే ఇబ్బందికరంగా ఉండేది. 1998లో దుబ్బాక, మిరుదొడ్డి మండలాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు తిమ్మాపూర్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పక్కా భవనంలో సేవలందిస్తున్నారు. భవనం చుట్టూ పచ్చని మొక్కలు.. చల్లని నీడనిచ్చే చెట్లు.. పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆవరణలో కాకుండా బయట సుమారు 200 మొక్కలు, చెట్లు పెంచారు. నిత్యం దవాఖానలో ప్రజలకు వైద్య సేవందిస్తూ, మరోపక్క మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోగులకు పచ్చని చెట్లు కనువిందు చేస్తూ.. మానసికంగా ప్రశాంతనందిస్తున్నాయి.
11 గ్రామాల్లో వైద్య సేవలు
తిమ్మాపూర్ పీహెచ్సీ పరిధిలో మొదట 17 సబ్ సెంటర్లు ఉండేవి. జనాభా ప్రతిపాదికత కింద ఆరేండ్ల కిందట రామక్కపేటలో మరో పీహెచ్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిమ్మాపూర్ పీహెచ్సీ పరిధిలో 7 సబ్ సెంటర్ల ద్వారా 11 గ్రామాలకు వైద్య సేవలందిస్తున్నారు. పోలియో చుక్కల పంపిణీతో పాటు జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాల సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో వైద్య సిబ్బంది ముందంజలో ఉంటున్నారు. కరోనా పోరులో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారు. 5వేల మందికి కరోనా పరీక్షలు చేసి, అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎయిడ్స్, క్యాన్సర్, క్షయ వ్యాధులతో పాటు సీజనల్, అంటు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం, శిశుపోషణ తదితర వాటిపై ప్రత్యేక అవగాహన కల్పించడంతో పాటు మందులు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్ తదితర వాధిగ్రస్తులకు సక్రమంగా మందులు అందజేస్తున్నారు. గ్రామాల వారీగా ఏఎన్ఎంలు ప్రజల ఆరోగ్య వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తూ సేవలందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు సహాయ వైద్యాధికారి, ఇద్దరు సూపర్వైజర్లు, 11మంది ఏఎన్ఎంలు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మాసిస్టు, నలుగు స్టాఫ్ నర్సులున్నారు. వీరితో పాటు ఆయూష్ వైద్యాధికారి మరో ముగ్గురు సిబ్బందితో ప్రజలకు ఆయూర్వేదిక్ వైద్యసేవలందిస్తున్నారు.
పీహెచ్సీకి అవార్డుల పంట
తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలకు జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు పొందారు. 2012, 2013లో జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాధికారిగా అవార్డు వచ్చింది. 2015,2016లో అప్పటి వైద్యాధికారి ప్రసన్నలక్ష్మి వరుసగా ఉత్తమ వైద్యురాలుగా అవార్డు పొందారు. 2015లో వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా తిమ్మాపూర్ పీహెచ్సీ వైద్యసేవలకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. 2016 వరల్డ్ పాపులేషన్ డే, 2018 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకుంది. ఇదే యేడాదిలో కాయకల్ప అవార్డునూ సొంతం చేసుకుంది. 2019లో ఆరోగ్యకేంద్రానికి, వైద్యాధికారి విజయరావుకు ఉత్తమ అవార్డు లభించింది. 2019లో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్(జాతీయ నాణ్యత ప్రమాణాల) కమిటీ బృందం దవాఖానను పరిశీలించి, సేవలను అభినందించింది. 2020లో జాతీయ ఉత్తమ ఆరోగ్యకేంద్రంగా ప్రకటించి, యేటా రూ.3 లక్షలు ప్రత్యేక నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని వైద్యసిబ్బంది శతశాతం పూర్తి చేసి ప్రత్యేకత చాటుకున్నారు. ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా 22,334 మందికి వైద్య పరీక్షలు చేసి, 4,769 మందికి కంటి అద్దాలు అందజేశారు. ఇప్పటి వరకు పీహెచ్సీలో 1062 ప్రసవాలు చేశారు. వరల్డ్ పాపులేషన్ సందర్భంగా ఈ యేడు జూలై 11న ఉత్తమ పీహెచ్సీ అవార్డు రాగా, వైద్యాధికారికి కలెక్టర్ అవార్డు అందజేశారు.
అదృష్టంగా భావిస్తున్నాం..
తిమ్మాపూర్ పీహెచ్సీకి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ పచ్చని వాతావరణంలో రోగులకు వైద్యసేవలందించడం సంతోషంగా ఉంది. వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు ప్రత్యేక కృషితో పీహెచ్సీకి ఎన్నో అవార్డులు దక్కాయి. జాతీయ ఆరోగ్య దినోత్సవాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ప్రజలతో కలిసి జరుపుకోవడం బాగుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఈ యేడు వరల్డ్ పాపులేషన్ సందర్భంగా ఉత్తమ పీహెచ్సీ అవార్డు వచ్చింది. వైద్య సిబ్బంది సమష్ఠి కృషితో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇక్కడ పని చేయడం అదృష్టం.
– భార్గవి, వైద్యాధికారి
ఆహ్లాదకరంగా ఉంటుంది..
తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వస్తే, ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. దావఖాన అంటే మందుల వాసనతో ఇబ్బందికరంగా కనిపించడం సహజం. ఇక్కడ ఇందుకు భిన్నంగా ఉంది. ఈ దవాఖానకు వచ్చే రోగులకు వైద్యంతో పాటు మంచి వాతావరణం పొందుతారు. దవాఖాన అభివృద్ధిలో వైద్యాధికారితో పాటు సిబ్బంది కృషి అభినందనీయం.
– కొత్త పుష్పలత, దుబ్బాక ఎంపీపీ, (హెచ్డీసీ చైర్మన్)
సేవలు బాగున్నాయి..
మా స్వగ్రామంలోని పీహెచ్సీకి మొదటి నుం చి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలుకరిస్తూ, మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. మనసు దోచుకునేలా పరిసరాలు ఉంటా యి. మంచి వాతావరణంతోనే రోగుల సగం జబ్బులు తగ్గిపోతున్నాయి. సిబ్బంది సేసేవలకు రాష్ట్రస్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి.
– కడతల రవీందర్రెడ్డి, జడ్పీటీసీ