వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న టీఆర్ఎస్ సర్కారు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, రైతు బీమా, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించి అన్నదాతలకు అండగా నిలబడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఈనెల12న నియోజకవర్గ కేంద్రాల్లో రైతు మహాధర్నాను నిర్వహిస్తామని, టీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతుబంధు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సిద్దిపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి. నిరంతరం రైతు శ్రేయస్సు కోసం పాటు పడుతుంది’. అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గ గ్రామ, వార్డుల పార్టీ కమిటీల నిర్వహణతో పాటు ఈనెల 12న నిర్వహించే రైతు మహాధర్నా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలోనూ సీఎం కేసీఆర్ రైతుబంధును అందించారని.. రైతు బీమా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. అయితే, రైతు ఆరుగాలం కష్టపడి పం డించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు రాబంధు అని విమర్శించారు. వరి ధాన్యం కొంటరా..? కొనరా..? అని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడిగితే నేటి వరకు సమాధానం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల12న నియోజకవర్గ కేంద్రాల్లో రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాధర్నాను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో పార్టీ శ్రేణులతో పాటు రైతుబంధు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయండి
సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయాలని పార్టీ మండల పరిశీలకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, పార్టీ బాధ్యులకు మంత్రి హరీశ్రావు సూచించారు. ఏ మండలంలో ఏ మేరకు పార్టీ కమిటీలు పూర్తయ్యాయి అని ఆయా మండల ఇన్చార్జీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 70 శాతం కమిటీలు పూర్తి అయినట్లు మంత్రికి పార్టీ ఇన్చార్జీలు వివరించారు. రెండు రోజుల్లో కమిటీలను పూర్తి చేయాలని, ఆ తర్వాత మండలాల వారీగా వచ్చే రెండు, మూడు రోజుల్లో పార్టీ విస్త్రత స్థాయి సమావేశాలను నిర్వహించుకుని మండల పార్టీ అధ్యక్షుడితో పాటు కార్యవర్గాన్ని, అనుబంధ కమిటీలను ఎన్నుకుందామని మంత్రి తెలిపారు.