తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. వర్షాలతో నాలుగు జిల్లాల్లోని 172 మండలాలు ప్రభావితమైనట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇప్పటి వరకు 24 మంది మృతిచెందారు. 17మంది గల్లంతయ్యారు. 23,345 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. అందులో 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. టీటీడీకి రూ.4 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గడిచిన 30 ఏండ్లలో ఈ స్థాయిలో వర్షాలు కురవలేదని ఆయన చెప్పారు. మొదటి ఘాట్ రోడ్డులోని నాలుగు ప్రాంతాల్లో, రెండో ఘాట్ రోడ్డులోని 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. శ్రీవారి మెట్టుమార్గంలో కొంతమేరకు రోడ్డు, ఫుట్పాత్ ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం దెబ్బతిన్నదని తెలిపారు. వర్షాలవల్ల తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక దర్శనానికి అనుమతించాలని నిర్ణయించినట్టు చెప్పారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్టు వెల్లడించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వరద పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. బాధితులకు తోడుగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్లు విడుదల చేసింది.