అసని తుపాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో7 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇక మిగిలిన పోర్టుల్లో 5 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. తుపాన్ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్ ఉందని తెలిపారు.
కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయ నగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను కారణంగా మత్స్యకారుల ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.