అహ్మదాబాద్: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. పోరాటమే మరిచిపోయినట్లు వరుసగా మూడో మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతులెత్తేయడంతో భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్గా రోహిత్కు ఇదే తొలి ట్రోఫీ కావడం విశేషం. శుక్రవారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 96 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (80), రిషబ్ పంత్ (56) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (13), ధవన్ (10), కోహ్లీ (0), సూర్యకుమార్ (6) విఫలం కాగా.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (33), దీపక్ చాహర్ (38) సత్తాచాటారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4, అల్జారీ, హైడెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఒడెన్ స్మిత్ (36) టాప్స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. టాపార్డర్ విఫలమైన చోట జట్టును నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్ మొత్తం పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి కోల్కతా వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 265 ఆలౌట్ (శ్రేయస్ 80, పంత్ 56; హోల్డర్ 4/34), వెస్టిండీస్: 37.1 ఓవర్లలో 169 ఆలౌట్ (ఒడెన్ స్మిత్ 36; ప్రసిద్ధ్ 3/27, సిరాజ్ 3/29).