ముంబై, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ పతనమయ్యింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి పెరగడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్..వడ్డీ రేట్లను త్వరితంగా పెంచుతుందన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోయాయి. జనవరి నెలలో అమెరికా వినియోగ ద్రవ్యోల్బణం 7.5 శాతం పెరిగింది. ఈ ప్రభావంతో 773 పాయింట్లు తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్ 58,153 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు క్షీణించి, 17,375 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి విలువ పతనంకావడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం కూడా ఇక్కడ సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని ట్రేడర్లు తెలిపారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ. 1,733 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
తాజాగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 3 శాతం తగ్గింది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 1-3 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, ఐటీసీలు స్వల్పంగా పెరిగాయి. అన్ని రంగాల ఇండెక్స్లూ తగ్గాయి. ఐటీ, రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్ సూచీలు అధికంగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.9 శాతం వరకూ క్షీణించాయి.
ఏడు వారాల కనిష్ఠానికి రూపాయి
అమెరికా డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా తగ్గింది. ప్రపంచ మార్కెట్లో డాలరు బలోపేతంకావడంతో ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ఒక్కసారిగా 21 పైసలు నష్టపోయి 75.36 వద్ద నిలిచింది. ఇది ఏడు వారాల కనిష్ఠస్థాయి.
రూ.3.91 లక్షల కోట్ల సంపద ఆవిరి
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.3.91 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.3,91,478 కోట్లు క్షీణించి రూ.2,63,89, 886 కోట్లకు పడిపోయింది.