Politics | ఇటీవల కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి, పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయ పార్టీల్లో చేరారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేసి తమిళనాడులో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. దీంతో స్వతంత్ర రాజ్యాంగాధికారులు, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజకీయ పార్టీల్లో చేరడంపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వివిధ విభాగాల మధ్య నియంత్రణలు, సమతుల్యతల సూత్రంపై రాజ్యాంగం పనిచేస్తుంది. శాసనసభకు కార్యనిర్వాహక వర్గం జవాబుదారీగా ఉంటుంది. రాజ్యంలోని ఈ రెండు శాఖలను స్వతంత్ర న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఎన్నికల కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వంటి ఇతర స్వతంత్ర సంస్థలు కూడా ప్రభుత్వ జోక్యం లేకుండా తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. నిర్ణీత కాలపరిమితి, ఆర్థిక స్వాతంత్య్రం, కఠినమైన తొలగింపు విధానం, పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆంక్షల ద్వారా ఈ సంస్థల స్వతంత్రతను నిర్ధారిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి వైదొలిగిన తర్వాత భారతదేశంలోని ఏ కోర్టు లేదా అథారిటీ ముందు న్యాయవాదిగా హాజరు కాలేరు. హైకోర్టు న్యాయమూర్తికి కూడా ఇలాంటి ఆంక్షలు ఉంటాయి. కాగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్/సభ్యులు పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మరే ఇతర పనులు చేపట్టడానికి వీల్లేదు. పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ఇలాంటి పదవుల్లో ఉన్న సమయంలో పక్షపాతం చూపకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు విధించారు.
రాజకీయ పార్టీల్లో చేరడం, ఎన్నికల్లో పోటీ చేయడం, కొన్ని పదవులకు నామినేట్ కావడం వంటి విషయాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. స్వతంత్ర రాజ్యాంగ పదవులు నిర్వహించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినవారు లేదా వివిధ పదవులకు నామినేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 1967, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసేందుకు, 1983లో రాజ్యసభ బరిల నిలిచేందుకు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి 1999లో పదవీ విరమణ చేసిన ఐదేండ్ల తర్వాత తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీ విరమణ చేసిన మూడేండ్ల తర్వాత 2004లో రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పదవీ విరమణ చేసిన నాలుగు నెలల్లోనే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రిటైర్డ్ కాగ్ను, న్యాయమూర్తులను రాష్ర్టాల గవర్నర్లుగా నియమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పలువురు బ్యూరోక్రాట్లు కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత లేదా పదవీ విరమణ చేసిన వెంటనే రాజకీయ పార్టీల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు.
పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులు రాజకీయ పార్టీల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు వారికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలని 2012లో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. అయితే ఇది రాజ్యాంగ నిబంధనలకు, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా కాదన్న అటార్నీ జనరల్ అభిప్రాయం మేరకు కేంద్రం ఈ సిఫారసును తిరస్కరించింది. రాజకీయాల్లోకి రాకముందు రిటైర్డ్ బ్యూరోక్రాట్లకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ విధించే చట్టాన్ని రూపొందించేలా పార్లమెంటును ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు 2022 మేలో కొట్టివేసింది. పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చే ముందు బ్యూరోక్రాట్లకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ప్రతి పౌరుడికి ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఒకటి. 2012లో ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక వ్యక్తి సర్వీసులో ఉన్న కాలంలో స్వతంత్రత, తటస్థతను కొనసాగించడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఒక సీనియర్ అధికారి ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత కనీసం ఏడాది పాటు ప్రైవేటు ఉద్యోగంలో చేరకూడదని ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రైవేటు రంగంలో లాభసాటి ఉపాధి పొందకుండా నివారించేందుకు ఇలాంటి నియంత్రణలు వచ్చాయని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, రాజ్యాంగ సూత్రాల కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అధికారులపై ఇటువంటి ఆంక్షలు చెల్లుబాటు అయ్యే పరిస్థితి రాకపోవచ్చు.
అటార్నీ జనరల్ అభిప్రాయం బలమైన న్యాయసూత్రంపై ఆధారపడినప్పటికీ, ‘న్యాయం చేయడమే కాదు, చేసినట్టు కనిపించాలి’ అనే ప్రసిద్ధ న్యాయ సూక్తిని గుర్తుంచుకోవడం కూడా అంతే అవసరం. ఇది న్యాయమూర్తులు, స్వతంత్ర రాజ్యాంగ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్లకు సమానంగా వర్తిస్తుంది. వారి అధికారిక విధులను నిర్వర్తించేటప్పుడు ఇది ఒక అనివార్య లక్షణం. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ఈ సూత్రాన్ని కొనసాగించడం సత్ఫలితాలను ఇస్తుంది. రాజకీయ పార్టీల్లో చేరడానికి లేదా ప్రభుత్వం ద్వారా రాజకీయ పదవులకు నామినేట్ కావడానికి కనీసం రెండేండ్ల కూలింగ్ పీరియడ్ను నిర్దేశించడం ద్వారా దీనిని సాధించవచ్చు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా క్విడ్ ప్రోకో ఆరోపణలను తోసిపుచ్చుతుంది.
–స్వామి ఆర్వీవీయస్