Sebi – NSE | డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ టైం పొడిగించాలన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేసిన ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ పక్కన బెట్టింది. ఈ విషయమై స్టాక్ బ్రోకర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదనను సెబీ తిరస్కరించినట్లు ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశీశ్ కుమార్ చౌహాన్ తెలిపారు. దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు – బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ట్రేడింగ్ ప్రతి రోజూ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తున్నది. క్యాష్, ఎఫ్ అండ్ ఓ విభాగంలోనూ ట్రేడింగ్ ఇదే సమయానికి నిలిచిపోతుంది.
అంతర్జాతీయంగా వివిధ దేశాల్లోని స్టాక్ మార్కెట్లలో పరిణామాలకు అనుగుణంగా వ్యవహరించడానికి వీలుగా తొలుత ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ నిర్వహించేందుకు అనుమతించాలని సెబీకి ఎన్ఎస్ఈ ప్రతిపాదించింది. రెండో దశలో రాత్రి 11.30 గంటలు, మూడో దశలో క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ పొడిగించాలని సెబీని ఎన్ఎస్ఈ కోరింది.
ఎన్ఎస్ఈ ప్రతిపాదన పట్ల కొందరు స్టాక్ బ్రోకర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. ట్రేడింగ్ టైం పెంపు విషయమై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ప్రభావం పడుతుందన్నారు. దీనికి అదనపు మ్యాన్ పవర్ కూడా అవసరమని చెప్పడంతోపాటు నిర్వహణ పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ‘సెబీ’కి స్టాక్ బ్రోకర్లు విన్నవించారు. డిస్కౌంట్ బ్రోకర్లు గడువు పొడిగింపునకు సరేనన్నారు. దీనిపై స్టాక్ బ్రోకర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో దీనిపై నిర్ణయాన్ని ‘సెబీ’ పక్కన బెట్టింది.
భారత్ కాలమానం ప్రకారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిశాక ఈయూ మార్కెట్లలో ట్రేడింగ్ మొదలవుతుంది. అమెరికాలోని స్టాక్ మార్కెట్లు భారత్ కాల మానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ట్రేడర్లు అప్రమత్తం కావడానికి వీలుగా ఈ ప్రతిపాదన చేసినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది.