న్యూఢిల్లీ, మే 18: భారత్లో డాటా సెంటర్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల సామర్థ్యం 950 మెగావాట్లకు చేరుకున్నదని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ తాజాగా వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, కొరియా దేశాలను అధిగమించినట్లు అయిందని తెలిపింది. చైనా తర్వాత అత్యధిక కెపాసిటీ సామర్థ్యం కలిగివున్నది భారత్లోననే తెలిపింది.
జపాన్లో డాటా సెంటర్ల కెపాసిటీ 773 మెగావాట్లు కాగా, సింగపూర్లో 718 మెగావాట్లు, హాంకాంగ్లో 613 మెగావాట్లు, కొరియాలో 531 మెగావాట్లు. 2024 నుంచి 2026 మధ్యకాలంలో భారత్లో అదనంగా 850 మెగావాట్ల కెపాసిటీ కలిగిన డాటా సెంటర్లు అందుబాటులోకి రానున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు భారత్ కేంద్ర బిందువుగా మారుతున్నదని, ముఖ్యంగా తమ డిజిటల్ సేవలను ఇక్కడి నుంచే అందించడానికి డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయన్నారు.