Bhimadevarapalli | భీమదేవరపల్లి, ఫిబ్రవరి 16: సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ముల్కనూరు అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం ఉదయం ప్రైవేటు స్కూలు బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు ఎల్కతుర్తి మండలం ఇందిరా నగర్ గ్రామంలో ఒక కార్పోరేట్ స్కూల్ ఉంది. ఈ స్కూలుకు చెందిన బస్సు పలు గ్రామాల్లో విద్యార్థులను తీసుకొని స్కూలుకు బయలు దేరింది. ఈ క్రమంలో ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద బస్సును టర్న్ చేస్తున్న క్రమంలో హనుమకొండ వైపు వెళ్తున్న లారీ స్వల్పంగా బస్సును ఢీ కొట్టింది.
ఈ సమయంలో పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై అరుపులు కేకలు వేశారు. కాగా విద్యార్థులు ఉన్న బస్సు ముందు భాగాన భారీగా దెబ్బతింది. అదృష్టవశాత్తు విద్యార్థులకు ఏమి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పరిమితికి మించి విద్యార్థులు అధికంగా ఉండడం కూడా ప్రధాన కారణమని స్థానికులు మండి పడుతున్నారు. సంఘటన స్థలాన్ని ముల్కనూర్ ఎస్సై రాజు పరిశీలించారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తప్పిన పెను ప్రమాదం..
ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు, ఒక క్లీనరు గాయపడ్డారు. లారీ ఢీకొనడంతో బస్సు డోర్ వద్ద ఉన్న క్లీనర్ తో పాటు ఒక విద్యార్థి ఎగిరిపడ్డాడు. బస్సు లోపల మరో విద్యార్థికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు చెప్పారు. నేషనల్ హైవే పై మార్గమధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీయకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా విగ్రహాలు చేయకపోవడం ఏమిటని ప్రజా ప్రతినిధులు, అధికారులను ప్రశ్నిస్తున్నారు.
మనుషుల ప్రాణాల కంటే విగ్రహాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తారా.. అని నిలదీస్తున్నారు. వాహనదారులు రోడ్డు నియమాలను తప్పక పాటించాలని చెబుతున్న పోలీస్ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు తొలగించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా రోడ్డు ప్రమాదాలు జరగకుండా అడ్డుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని కోరుతున్నారు.