న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో అంతర్గత దావానలం రగులుతున్నది. ఒకరిపై ఒకరు సీనియర్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తన వ్యాఖ్యలతో మళ్లీ వివాదాన్ని లేవనెత్తారు. పార్టీ సభ్యులు, కేరళ రాజకీయాలపై అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని అయ్యర్ అన్నారు. ఎందుకంటే పార్టీలోని నేతలే ఒకరిపై ఒకరు విద్వేషాన్ని చిమ్ముతున్నారని, కమ్యూనిస్టుల కన్నా ఎక్కువగా ఆ ద్వేషం ఉందని అయ్యర్ అన్నారు.
తిరువనంతపురం ఎంపీ శశిథరూర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ అంశంలో శశి థరూర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. థరూర్ను యాంటీ పాకిస్తానీగా వర్ణించారు. బహుశా శశిథరూర్ విదేశాంగ మంత్రి కావాలనుకుంటున్నట్లు అయ్యర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఓ కీలుబోమ్మ అని అయ్యర్ పేర్కొన్నారు. ఆయనేమీ పార్టీ ప్రతినిధి కాదన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి లేదరని, ఒకవేళ పవన్ ఖేరానే కొనసాగితే, అప్పుడు పార్టీ ఈ స్థాయిలోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ను ఉద్దేశిస్తూ కూడా అయ్యర్ కొన్ని వ్యాఖ్యలు చేవారు. జై రాం తన పని తాను చూసుకోవాలన్నారు. అయ్యర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీతో అయ్యర్కు సంబంధం లేదని ఖేరా అన్నారు. ఆయన వ్యక్తిగతం వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.