భారీ ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు ఒక శాతం మేర నష్టంతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో మొత్తం 141.55 పాయింట్ల నికర నష్టంతో నిఫ్టీ నిలిచింది. వారం ప్రారంభంలోనే 300 పాయింట్లకుపైగా నష్టపోయిన నిఫ్టీ.. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు కోలుకున్నప్పటికీ, కొత్త గరిష్ఠ స్వింగ్ను ఏర్పాటు చేయలేకపోయింది. దీనికితోడు ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచవచ్చునన్న అంచనాలతో విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు కొనసాగాయి. శుక్రవారం నాటి పతనంతో మరోసారి 50 రోజుల చలన సగటుకు దిగువనే నిఫ్టీ స్థిరపడింది. అలాగే 20 రోజుల చలన సగటుకు ఎగువన కేవలం రెండు రోజులు ముగిసిన నిఫ్టీ.. ఈ క్షీణతతో కీలక స్వల్పకాలిక చలన సగటు డౌన్ట్రెండ్లోకి ప్రవేశించింది. దీంతో నిఫ్టీ ట్రయాంగిల్ను ఏర్పాటు చేస్తున్నైట్టెంది. సాధారణంగా ట్రయాంగిల్స్ అంతకుముందే ఉన్న ట్రెండ్ను కొనసాగిస్తూ కన్సాలిడేషన్గా ఏర్పడతాయి. ఇప్పటికే వీక్లీ చార్ట్లో డౌన్ట్రెండ్ ఛానెల్లో కదలాడుతున్న నిఫ్టీ.. ఈ వారం 17,100 కన్నా దిగువకు పతనమైతే ట్రయాంగిల్ బ్రేక్డౌన్ అవుతుంది. మళ్లీ 50 రోజుల చలన సగటు 17,464, అలాగే 20 రోజుల చలన సగటు 17,566 స్థాయిలకు ఎగువన ముగిస్తేనే అప్ట్రెండ్లోకి ప్రవేశిస్తుంది. ఇండికేటర్లలో ఎక్కడా సానుకూల ధోరణులు కనిపించడం లేదు. ఇక ఈ వారం నిఫ్టీ 17,040-17,100 మద్దతు స్థాయిలకు దిగువన పతనమైతే మరింత అమ్మకాల ఒత్తిడికి అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు, కంపెనీలతోపాటు మెటల్ రంగ షేర్లు మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా బేస్ మెటల్ స్టాక్స్ ఈ వారం కూడా వెలుగులో ఉండవచ్చు. హిందాల్కో, వేదాంత, టాటాస్టీల్ లాంటి కంపెనీల షేర్లలో అప్ట్రెండ్ చూడవచ్చు. వీటిలో దీర్ఘకాల బ్రేకవుట్లు కూడా జరిగాయి.