నేటి నుంచి ఎనిమిదో విడత సాయం అందజేత
నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ
యాసంగి సాగుకు అక్కరకు రానున్న డబ్బులు
ఏడు విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ. 5,245.28 కోట్లు అందించిన ప్రభుత్వం
యాసంగి సాగుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం నేటినుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపించారు. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి వరుసగా ఎనిమిదో పంటకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 27 : రైతుబంధు డబ్బులు రైతులకు అందే సమయం ఆసన్నమైంది. యాసంగి సాగు కోసం నేటినుంచి పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమచేయనున్నది. 2018, మే నెలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు వరుసగా ఏడు పంటలకు సాయం అందించారు. ఈసారి యాసంగి సాగుకు అందిస్తున్నది ఎనిమిదో విడత సాయం. గత ఏడు విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 50,64,568 మంది రైతులకు రూ.5,245.28 కోట్లు ప్రభుత్వం అందించింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులకు లగోడికి రంది లేకుండా పోయింది. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధల నుంచి వారికి విముక్తి లభించింది.
గత ఏడు విడతల్లో రూ.5,245.28 కోట్ల సాయం..
రైతుబంధు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడు పంటలకు గాను 50,64,568 మంది రైతులకు రూ.5,245.28 కోట్లు ప్రభుత్వం అందించింది. సిద్దిపేట జిల్లాలో 17,13,812 మంది రైతులకు రూ.1823.08 కోట్లు, మెదక్ జిల్లాలో 14,92,756 రైతులకు రూ.1257.12కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 18.58 లక్షల మంది రైతులకు రూ. 2165.08 కోట్లను గత ఏడు విడతల్లో ప్రభుత్వం అందజేసిం ది. ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నది. రైతన్నకు దన్నుగా నిలుస్తున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు నేటినుంచి ఎనిమిదో విడత రైతుబంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనుంది. మే 2018లో సీఎం కేసీఆర్ పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొ ప్పున రెండు పంటలకు గాను ఏడాదికి రూ.8 వేలను అందించారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తానని హామీ ఇచ్చి అమలు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగి పంటతో కలుపుకొంటే వరుసగా ఎనిమిదో విడత ఇది. రైతుబంధు డబ్బులు పడనుండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
రైతులకు సీఎం కేసీఆర్ చేయూత
సీఎం కేసీఆర్ రైతులకు చేయూతగా నిలుస్తు వారిని అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులకు పంట పెట్టుబడి సాయా న్ని అందించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రమే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే రైతుబీమా పథకాన్ని ప్రారంభించి రైతు కుటుంబాలకు భరో సా కల్పిస్తున్నారు. సబ్సిడీ యంత్రాలు, ఎరువు లు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేసి అండగా నిలుస్తున్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించారు. వ్యవసాయానికి నాణ్యమైన 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నారు.
రైతులకు తప్పిన లగోడి తిప్పలు…
సీఎం కేసీఆర్ ఏటా రెండు పంటలకు రైతుబంధు పథకం ద్వారా పంటల సాగుకు పెట్టుబడులు అందిస్తుండడంతో రైతులకు తిప్పలు తప్పాయి. గతంలో రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. దీంతో ఆర్థికంగా చితికి పోయేవారు. సీఎం కేసీఆర్ రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. షావుకార్ల వద్దకు వెళ్లే తిప్పలు తప్పడంతో సంతోషంగా ఉన్నారు. సాగు సమయానికి లగోడికి రైతులకు రంది లేకుండా పోయింది. గత ప్రభుత్వాలు ఇలా పెట్టుబడి సాయం ఇవ్వక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకవచ్చి సాగు చేసేవారు. తీరా పంట చేతికి వచ్చే సరికి ఆ వడ్డీలకే పంట సరిపోయేది. దీంతో రైతులు అప్పుల పాలయ్యేవారు. ఇప్పుడు రైతులకు అలాంటి పరిస్థితులు లేవు.
రైతుబంధుతో వ్యవసాయానికి పునరుజ్జీవం..
నిర్వీర్యమవుతున్న వ్యవసాయానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథ కం పునరుజ్జీవం పోసింది. వానకాలం, యాసంగి పంటల సాగుకు ముందే అందుతున్న పెట్టుబడి సాయంతో రైతులు అప్పుల పాలు కాకుండా కాపాడుతున్నది. సమైక్య రాష్ట్రంలో రైతులు పంటల సాగు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో అనేక మంది పెద్దపెద్ద భూస్వాములు వారి భూములను పడావు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి బతికిన పరిస్థితుల ఉండేవి. ఇప్పుడు పథకం ఇస్తున్న భరోసాతో తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారనేది నిజం. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,35,312 మంది రైతులకు రూ.387.86 కోట్ల పెట్టుబడి సాయం ఏడాదికి రెండు విడతలుగా ప్రభుత్వం అందజేస్తున్నది. -వెంకట్రామ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి