అన్నదాతల శ్రేయస్సు కోసం తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పెట్టుబడి సాయాన్ని మాత్రం అదునుకు అందిస్తూ రైతాంగానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ యాసంగికి సంబంధించిన వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన దృష్ట్యా ఇతర పంటలు వేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఆరుతడి పంటలు కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు, మినుములు, పత్తి, పప్పుదినుసులు, ఆకు కూరలు, కూరగాయల సాగుపై అన్నదాతలు దృష్టి సారించారు. దుక్కులు దున్ని విత్తనాలను విత్తేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. రైతుబంధు పెట్టుబడి సాయం ఎనిమిదో విడుత కింద ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు సుమారు రూ.350 కోట్లు కేటాయించగా, వికారాబాద్ జిల్లాకు ఏడు విడుతల్లో రూ.1953.2 కోట్లను కేటాయించింది. ఎనిమిదో విడుత రైతుబంధు నగదు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నది. ప్రతి ఏటా సమయానికి పెట్టుబడి సాయం అందుతుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 12 : జిల్లా రైతాంగం పెట్టుబడుల కోసం ఎవరి ముందూ చేయిచాచకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 3లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10వేలు ప్రభుత్వం అందజేస్తున్నది. యాసంగిలో 8వ విడుతలో రైతులకు పెట్టుబడి సాయం ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా అర్హులైన రైతులను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం వారి కోసం జిల్లాకు రూ.350కోట్ల నిధులను కేటాయించింది. గత వర్షాకాల సీజన్లో ప్రభుత్వం జిల్లాలో రైతు బంధు సాయంగా 2,82,094 మంది రైతులకు సుమారు రూ.343కోట్ల41లక్షలను అందించింది.
ఈ యాసంగిలోనూ రైతులు పెట్టుబడి కోసం ఎవరినీ ఆశ్రయించవద్దన్న ఉద్దేశంతో పంటల ప్రారంభంలోనే పెట్టుబడి సాయాన్ని అందించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్ కంటే ఈ సీజన్లో రైతుబంధుకు అర్హులైన మరో 18వేలకు పైగా రైతులు ఎంపికయ్యారు. గత సీజన్లో జిల్లాకు రైతుబంధు పథకం కింద రూ.343కోట్ల41లక్షల నిధులను విడుదల చేయగా ఈ సీజన్లో రూ.350కోట్ల పైచిలుకు నిధులను కేటాయించింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ నెల 15 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోనే పెట్టుబడి సాయం డబ్బులు జమకానున్నాయి. ప్రభుత్వం యాసంగిలో వరి పంటను వేయవద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిహారాన్ని రైతులు ఇతర పంటల కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నారు. గత వర్షాకాలం సీజన్లో జిల్లాలో 1.50వేల ఎకరాల్లో వరి పంటను వేశారు. ఈ సీజన్లో ఆరుతడి పంటలు వేసేలా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ఈ నెల 15 నుంచి రైతు బంధు అందజేస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పంటలవైపు దృష్టి సారిస్తున్న జిల్లా రైతులు
వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారంతో పాటు రైతుల్లో అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో జిల్లా రైతులు ఇతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పెద్దఎత్తున కూరగాయలు, ఆకుకూరల పంటలను వేసి పెద్దఎత్తున లాభాలు గడిస్తున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండటం వలన ప్రతిరోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు కూరగాయలు, ఆకుకూరలను ఎగుమతి చేయడంలో రంగారెడ్డిజిల్లా ముందంజలో ఉంది.
ఇప్పటికే మార్కెట్లో వరిధాన్యం, బియ్యం నిల్వలు పెద్దఎత్తున ఉండటం వలన ఈ సీజన్లో కూడా వరి వేస్తే డిమాండ్ తగ్గుతుందని ప్రభుత్వం రైతుల్లో అవగాహన కల్పిస్తున్నది. మున్ముందు మార్కెట్లో వరి ధాన్యం డిమాండ్ తగ్గుతుందని.. అలాగే, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జిల్లా రైతాంగం కంది, వేరుశనగ, సజ్జలు, రాగులు, మినుములు, పత్తి వంటి పంటలపై దృష్టి సారిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరల సాగు కోసం సమాయత్తమవుతున్నారు. గత సీజన్లో వేసిన 1.50లక్షల ఎకరాల్లో వరిసాగు చేసిన నేపథ్యంలో ఈ సీజన్లో పూర్తిగా ఆరుతడి పంటలు సాగుచేసేలా వ్యవసాయశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఏడు విడుతల్లో రూ.1953.2కోట్లు
పరిగి, డిసెంబర్ 12 : 2018 వానకాలంలో రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. మొదట ఎకరాకు సీజన్కు రూ.4వేలు పెట్టుబడిని అందించగా, 2019 నుంచి ఎకరాకు సీజన్కు రూ.5వేలు పెట్టుబడిని అందజేస్తున్నారు. ఇప్పటివరకు 7 విడుతల్లో వికారాబాద్ జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయంగా రూ.1953.2 కోట్లు అందజేసింది. ఎనిమిదో విడుతతో రైతు బంధు సాయం నిధులు రూ.2వేల కోట్లు దాటనున్నది.
రైతుల పాలిట కల్పతరువు
ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి..
అదునుకు పెట్టుబడి సాయం..
వానకాలం, యాసంగి సీజన్లలో అదునుకు పెట్టుబడి సాయం అందుతున్నది. అప్పు కోసం బ్యాంకులు, సొసైటీలు, ఇతరుల చుట్టూ తిరుగాల్సిన పనిలేదు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చు. అన్నదాత శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తెలంగాణ సర్కారుకు రైతాంగం రుణపడి ఉంటుంది.