సంగారెడ్డి జిల్లాలో 28,656 మందికి మొదటిసారిగా రైతుబంధు డబ్బులు
అత్యధికంగా నాగల్గిద్ద మండలంలో 2314 మందికి..
సంగారెడ్డి, డిసెంబర్ 29 : సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్కు కొత్తగా 28,656 మంది తొలిసారిగా రైతుబంధు అందుకుంటున్నారు. అత్యధికంగా నాగల్గిద్ద మండలంలో 2314 మంది రైతులకు తొలిసారి తీసుకుంటున్నారు. కంగ్టి మండలంలో 1130 మందికి డబ్బులు అందాయి. ఝరాసంగం మండలంలో 1260, జహీరాబాద్లో 894, కోహీర్లో 834, వట్పల్లిలో 805, అందోల్లో 1380 మంది డబ్బులు అందుకుంటున్నారు. నాగల్గిద్ద మండలానికి చెందిన 2314 మంది రైతులు, రాయికోడ్ మండలంలో 1076, మొగుడంపల్లిలో 738, నారాయణఖేడ్లో 1848, కల్హేర్లో 855, పుల్కల్లో 1640, మునిపల్లిలో 1263 మంది రైతులు మొదటిసారి లబ్ధిపొందుతున్నారు. సిర్గాపూర్ మండలానికి చెందిన కొత్త రైతులు 587 మంది, న్యాల్కల్లో 857, మనూరులో 1136, సదాశివపేటలో 1990, జిన్నారంలో 780మంది రైతులు రైతుబంధు తీసుకుంటున్నారు. సంగారెడ్డి మండలంలో రైతుబంధు తీసుకుంటున్న రైతులు 648 మంది, కొండాపూర్లో 1156, గుమ్మడిదలలో 504, హత్నూరలో 1808, పటాన్చెరులో 1338, కందిలో 1141, రామచంద్రాపురంలో 364, అమీన్పూర్లో 310 మంది రైతులు ఉన్నారు. ఈ యాసంగి సీజన్కు 3,54,360 మంది రైతులు ఖాతాల్లో రూ.389.05 కోట్లు జమ చేస్తోంది. గత వానకాలం సీజన్లో జిల్లాకు చెందిన 3,03,124 మంది రైతుల ఖాతాల్లో రూ.366.85 కోట్ల జమ చేసింది.
ప్రతీ సీజన్లో పెట్టుబడి సాయంతోనే సాగు చేస్తున్నా
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా చరిత్రలో నిలుస్తాడు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే 24 గంటలు కరెంట్ను ఉచితంగా ఇచ్చాడు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ఇచ్చి అప్పుల నుంచి కాపాడిండు. ఏటా నాకు పెట్టుబడి సాయమందుతుంది. నాకున్న రెండున్నర ఎకరాలకు రూ. పన్నెండు వేల ఐదువందలు బ్యాంకు ఖాతాలో జమైంది. దేశ చరిత్రలో రైతులను ఆదుకుంటున్న ఒకే ఒక్క సీఎం మన కేసీఆర్ సారు. ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ, దయకు రుణపడి ఉంటాం. ఇతర పంటల కింద ప్రస్తుతం టమాటా సాగు చేశా. ఇప్పుడు టమాటాకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. -అమ్మగారి రవీందర్రెడ్డి, రైతు, గుమ్మడిదల
మంచి పని చేస్తున్న సీఎం
రైతులందరూ బాగుండాలని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడికి డబ్బులు ఇస్తుండు. దేశంలో ఇంతమంచి సీఎం మరెక్కడా లేడు. నా చేనులో శనగ పంట వేసిన. పురుగు మందులు కొట్టడానికి పైసలు సరిపోతయి. పంటల సమయంలో రైతుబం ధు ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నది.
-సత్యమ్మ, రైతు, కవేలి, కోహీర్ మండలం
రైతులంటే సీఎంకు ఎంతో అభిమానం
రైతులంటే సీఎం కేసీఆర్ సార్కు ఎంతో అభిమానం. రైతులందరూ అభివృద్ధి చెం దాలని అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నడు. ఇంతకుముందు వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ వచ్చినంక రైతుబంధు ఇస్తున్నందున పెట్టుబడికి ఇబ్బందులు తప్పినయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-నారాయణరెడ్డి, రైతు, దిగ్వాల్, కోహీర్ మండలం
రైతుల బతుకులు మారుతున్నయ్..
రైతులకు పెట్టుబడి భారం కాకూడదని సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మేలు చేసిండు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ప్రతి ఏటా రూ. 40 వేలు వస్తున్నయి. నా పొలంలో కంది, సోయ, జొన్న పంటలతో పాటు చెరుకు పండిస్తున్నాను. ఎరువులు, విత్తనాల కొనుగోలు, సాగు ఖర్చులు, కూలీలకు డబ్బులు చెల్లించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నయ్. తెలంగాణ సర్కారు పాలనలో రైతుల బతుకులు మారుతున్నయ్.
-పూర్ణచందర్, రైతు, ఖలీల్పూర్, న్యాల్కల్ మండలం
ఎంతగానో ఉపయోగపడుతుంది
రైతుబంధు ద్వారా పెట్టుబడి అందిస్తుండడం సంతోషంగా ఉంది. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సర్కారు ఇచ్చే సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలను పండించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నయ్. నాకు ఉన్న ముడున్నర ఎకరాలకు ప్రతి వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 26వేలు వస్తున్నాయి. పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-నర్సింహారెడ్డి, రైతు, మామిడ్గి, న్యాల్కల్ మండలం
ఎంతో ఆసరాగా..
నాకు మొదటి రోజే బ్యాంకు ఖాతాలో రూ.15వేలు పడినట్లు మెస్సేజ్ వచ్చింది. మొదటి దఫాలో వచ్చిన డబ్బులతో పందిరి సాగు పెట్టిన. మూడెకరాల్లో మొత్తం పందిరి సాగుతో కూరగాయలు, జామ తోట, కొద్దిగా బొప్పాయి చెట్లు పెట్టా. పంటలు బాగా పండాయి. కేసీఆర్ సార్ మాలాగే వ్యవసాయం చేస్తున్నడు కాబట్టే, మా బాధలు గుర్తించి, ఆదుకుంటుండు. -శ్రీనివాస్రెడ్డి, శేర్పల్లి, గజ్వేల్
లాగోడికి తిప్పల్లేకుండ జేసిండు
కేసీఆర్ సార్ రాక ముందు లాగోడి (పెట్టుబడి) పైసలకు అరగోస పడేటోళ్లం. బంగారం కుదువపెట్టేది. అయినా ఒక్కోసారి ఒక్క రూపాయి కూడా దొరికేదికాదు. శానా కట్టమయ్యేది. గిప్పుడు గసోంటి తిప్పల్లేవు. ఎవుసం జేసేటోళ్లకు కేసీఆర్ సారు అన్ని సౌలత్ జేత్తుం డు. రైతులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల పైసలు ఏత్తండు. షావుకార్ల దగ్గర అప్పుకు పోకుండా జేసిండు. నాకు నాలుగెకరాల భూమి ఉంది. నా ఖాతాలో పైసలు పడ్డప్పుడు సెల్ఫోన్కు మెసేజ్ వస్తది. ఆ పైసలు తీసుకోని పంట పెట్టుబడికి ఖర్చుపెడ్తా.
-లక్ష్మణ్ నాయక్, రైతు, నాగల్గిద్ద