అన్నదాతల ఫోన్కు మెస్సేజ్లు
రెండోరోజూ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ
పెట్టుబడి సాయంపై సంబురాలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
నిజామాబాద్లో రెండోరోజుకూ రూ.75.46కోట్లు
సాగు సమయానికి ఆదుకుంటున్న పెట్టుబడి సాయం
నిజామాబాద్, డిసెంబర్ 29 : టంగ్… టంగ్… మంటూ పెట్టుబడి సాయం నగదు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 28వ తేదీ నుంచి మొదలైన ప్రక్రియ రెండో రోజు జోరుగా సాగింది. మొదటి రోజూ ఎకరం లోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో తొలిరోజు 81వేల 17మంది రైతులకు రూ.24.47 కోట్లు జమ అయినట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండోరోజు 70వేల మంది రైతులకు రూ.50.99 కోట్లు జమ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. రెండు రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షా51వేల 32మంది రైతులకు పెట్టుబడి సాయం జమ అయ్యింది. మొత్తం రూ.75.46కోట్ల పంపిణీ పూర్తయ్యింది. మూడో రోజు నుంచి దాదాపుగా మూడు ఎకరాలకుపైగా కమతాలున్న రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకు చేరనున్నది. మొత్తంగా రైతుబంధు నగదు పంపిణీ ప్రక్రియ 10రోజుల వ్యవధిలోనే పూర్తిచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు నిర్ణీత కాలవ్యవధిలోనే పెట్టుబడి సాయం డబ్బులు రైతుల చేతికి అందనున్నాయి. సాంకేతిక కారణాలతో రైతుబంధు నగదు రాని వారుంటే తమను సంప్రదిస్తే వివరాలు పరిశీలించి అందేలా చూస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పండుగలా ఎవుసం
పొలంలో మెంతికూర తెంపుతున్న ఈ దంపతుల పేర్లు నేనావత్ మోహన్, కాంతి. వీరిది ఇందల్వాయి మండలం కేకే తండా. ఎకరం భూమిని నమ్ముకుని 40ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. గతంలో పంట వేయాలంటే వడ్డీ వ్యాపారుల వద్ద చేయి చాపే పరిస్థితి వీళ్లది. కష్టపడి పండించిన తర్వాత వచ్చే డబ్బులు మిత్తికిపోను కాస్తాకూస్తో మిగిలేవి. మళ్లీ పంట వేయాలంటే అప్పుచేయక తప్పేది కాదు. ఏండ్లకొద్దీ వారి సాగు ఇట్లనే సాగింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో వీరి వ్యవసాయానికి రంది తీరింది. సాగు సమయానికి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడుతుండడంతో వీరికి ఎరువులు, విత్తనాల ఖర్చులకు ఆసరాగా నిలుస్తున్నాయి. దీంతో పండిన పంట విక్రయించగా వచ్చిన డబ్బులు ఇంతకుముందు కన్నా ఎక్కువగానే మిగులుతున్నయని వారంటున్నరు. అప్పుకోసం చెయ్యి జాపకుండా బతుక గలుగుతున్నమని సంబురపడుతున్నరు. ఈసారి యాసంగికి సంబంధించి పెట్టుబడి డబ్బులు రూ.5వేలు మంగళవారం ఖాతాలో పడ్డాయని వారు చెప్పారు.
రైతు‘బంధు’వు కేసీఆర్…
అన్నదాతల గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సామాన్య రైతుల కష్టాలను తీరుస్తున్నది. సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తున్నది. ఏటా వానకాలం, యాసంగి సీజన్ వచ్చిందంటే చాలు సాగుకు సన్నద్ధం కావడం రైతుకు ఓ ప్రహసనంగా ఉండేది. అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేది. దీంతో అప్పులపై వడ్డీలు పెరిగి తీరా పంట నష్టం సంభవిస్తే అసలు కట్టడమే గగనం అయ్యేది. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయే రైతన్నకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకం ద్వారా మేలు చేకూర్చారు. ఏడాదికి ఎకరం సాగు భూమికి రూ.10వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించడమే ధ్యేయంగా తీసుకువచ్చిన పథకంతో అన్నదాతలు సంబురపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా…
రైతుబంధు పథకం అర్హుల జాబితా వివరాలను ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న వారందరికీ రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. యాసంగి సీజన్కు ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు అండ లభించబోతున్నది. ఉభయ జిల్లాలో 5లక్షల 49వేల 140 మందికి పెట్టుబడి సాయం అందించనున్నారు. వీరికి మొత్తం రూ.533.122 కోట్లను ప్రభుత్వం వెచ్చించనున్నది. నిజామాబాద్ జిల్లాలో 2,67,044 మంది పట్టాదారులకు 5,45,451ఎకరాల భూమి ఉండగా, ఇప్పటికే మొదటి, రెండు రోజుల్లోనే 50శాతం మందికిపైగా రైతులకు రైతుబంధు నగదు చేరింది. ఎకరానికి రూ.5వేలు చొప్పున వీరందరికీ రూ.272.725 కోట్లు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయబోతున్నారు. కామారెడ్డి జిల్లాలో 2,82,096 మంది పట్టాదారులకు 5,20,794 ఎకరాల వ్యవసాయ భూములుండగా రూ.260.397 కోట్లు ప్రభుత్వం రైతుబంధు పథకం రూపంలో పంపిణీ చేస్తున్నది.
ఎవలకు బాకీ పడ్తలే..
ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 29 : ఈ రైతు పేరు మామిడి లింగయ్య. ఇతనిది ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డి గ్రామం. లింగయ్యకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కొడుకులకు రెండు ఎకరాలు ఇచ్చేసి మిగతా రెండు ఎకరాల్లో సొంతంగా వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగేండ్ల కింద వానకాలం, యాసంగి సమయంలో దుకాణాల వద్ద బాకీ చేసి విత్తనాలు కొంటుండె. పంట అమ్మిన తర్వాత బాకీ వడ్డీతో సహా చెల్లిస్తుండే. దీంతో పెట్టుబడికి చేసిన అప్పుల వడ్డీలకు, ఖర్చులకే పంట డబ్బులు సరిపోయేవి. తర్వాత పంట వేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకుంటుండె. మళ్లీ దుకాణాదారుడి వద్ద బాకీ చేయాల్సిన పరిస్థితి. నాలుగేండ్ల నుంచి రైతుబంధు డబ్బులు పంట సాగుకు ముందే అందుతుండడంతో విత్తనాలకు, ఎరువులకు దుకాణాదారుడి వద్ద బాకీ చేయాల్సిన దుస్థితి పోయింది. ప్రస్తుత యాసంగికి సంబంధించి లింగయ్యకు ఉన్న రెండు ఎకరాలకు రూ.10వేలు బుధవారం బ్యాంకు ఖాతాలో పడ్డాయి. వీటిలో పంట పెట్టుబడికి పోనూ వ్యవసాయ పనిముట్లు కొనుక్కొని, ఎవరిపైనా ఆధారపడకుండా ఎవుసం చేసుకుంటానని చెబుతున్నాడు లింగయ్య.