ఆ నాలుగు కారణాలు ప్రమాదాలకు మూలాలు
డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్, నిర్లక్ష్య డ్రైవింగే..
రాచకొండ కమిషనరేట్లో వారం రోజుల్లో 100 ప్రమాదాలు
15 మంది మృతి.. 88 మందికి గాయాలు
మొత్తంగా 34 వేల ఉల్లంఘనలు
సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మహానగరంలో మాత్రం ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 18 నుంచి 24 వరకు 100 ప్రమాదాలు జరగ్గా.. ఇందులో 15 మంది చనిపోయారు. మరో 88 మందికి త్రీవ గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలపై విశ్లేషణ జరిపిన పోలీసులు.. మానవ తప్పిదాలతోనే ముఖ్యంగా డ్రంకన్డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్, అడ్డదిడ్డ డ్రైవింగ్తోనే ఇవి జరిగాయని తేల్చారు.
చిన్నచిన్న నిర్లక్ష్యాలతో అనేక మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతుండగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మొత్తంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 34,042 ఉల్లంఘనదారులను గుర్తించి రూ.1.37 కోట్ల ఈ-చలాన్లు విధించారు. ఇందులో అధికంగా హెల్మెట్ ధరించని వారు (19,866), లైసెన్స్ లేని వారు (1095), ఓవర్ స్పీడ్(1987), డ్రంకన్ డ్రైవ్ (413) కేసులు ఉన్నాయి. డ్రంకన్ డ్రైవ్ కేసులపై న్యాయస్థానాలు 369 మందికి జరిమానాలు, 20 మందికి జైలు శిక్ష విధించాయి. తాగి వాహనం నడుపుతున్న వారి 30 నుంచి 40 ఏండ్లలోపు వారే ఎక్కువని.. వారి బీఏసీ కౌంట్ 300 దాటుతుందని ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్నారు.