యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామివారి మహాకుంభ సంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లపై ఆలయ అర్చకులు, అధికారులు దృష్టి సారించారు. గర్భాలయం, అంతరాలయం, మహామండపంలోని ఉపాలయాల పరిశుద్ధి కార్యక్రమాన్నిశనివారం ఆలయ ప్రధానార్చకుల బృందం చేపట్టింది. బాలాలయంలో ఈ నెల 21న ప్రారంభమయ్యే పంచ కుండాత్మక మహాయాగానికి సంబంధించి యాగశాల నిర్మాణం పూర్తయ్యింది. మరోవైపు 28న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సమీక్ష నిర్వహించారు.
యాదాద్రి, మార్చి 19 : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 28న యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్, కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. యాదాద్రి కొండపైన వీవీఐపీ అతిథి గృహంలో వైటీడీఏ, ఆలయ, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ అధికారులతో పాటు భద్రతా ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. ప్రధానాలయం పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పన, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ రవాణ సౌకర్యాలపై అధికారులు పలు సూచనలు చేశారు. దీంతో పాటు కొండపై వచ్చే భక్తులు, బస్సులను పరీక్షించేందుకు స్కానర్లను అమర్చే విధానం, కొండచుట్టూ నిర్మిస్తున్న రింగురోడ్డుకు భద్రత నిమిత్తం అధునాతన స్కానర్లు ఏర్పాట్లు, వివిధ దేశాల సాంకేతికత, కెమెరాలు, లైటింగ్, బాంబు డిటెక్టర్లు, బాంబు స్కానర్లు వినియోగించేలా ఇందుకనుగుణంగా కావాల్సిన స్థలాలపై అధికారులు పరిశీలన చేశారు. కొండపైన కమాండ్ కంట్రోల్ రూం, బస్బే, క్యూ కాంప్లెక్స్, ప్రధానాలయంతో పాటు గండిచెరువు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణితో పాటు, ప్రెసిడెన్సియల్ సూట్లు పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ఆర్డీఓ భూపాల్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఏసీపీ నర్సింహారెడ్డి, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, సీఐలు జానకీరెడ్డి, నవీన్రెడ్డి, అధికారులు రామారావు, ఈఈ శంకరయ్య పాల్గొన్నారు.