– నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ సిటీ, జనవరి 22 : సీఎం రేవంత్రెడ్డి తీరుతో ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి, రాత్రి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుతో చీకటి ఒప్పందాలు చేస్తున్నడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మారలేదు, భాష మారలేదన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి తీరుతో విసుగు చెందిపోయారన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి అక్రమాలను, కాంగ్రెస్ పార్టీ ఆగడాలను, తప్పిదాలను ఎప్పటికప్పుడు, ఎక్కడిక్కడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.
ప్రజాక్షేత్రంలో అరాచక కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిపారు. బొగ్గు కుంభకోణం, కాంగ్రెస్ ప్రభుత్వ స్కాంలను ఎండగట్టినందుకే హరీష్ రావుపై అక్రమ కేసు బనాయించారన్నారు. కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే హరీశ్ రావుకు రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా సిగ్గులేని రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ విచారణ అంటూ హరీష్ రావు ను ఇబ్బందులు పెడుతుందని దుయ్యబట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఎలక్షన్స్ వస్తేనే కేసీఆర్ పై కాళేశ్వరం కేసు, కేటీఆర్పై ఫార్ములా ఈ రేసు కేసు, హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటూ వేధింపులు గురిచేస్తుందన్నారు. హరీష్ రావు గారు మాట్లాడిన విషయంలో ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇన్నిసార్లు నల్లగొండ జిల్లాకు వచ్చినా ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అధికారం, ధనం, పోలీస్ యంత్రాంగంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుందన్నారు. సీనియర్ కాంగ్రెస్ మంత్రులందరి ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నాడన్నారు. అధికారులు పై స్థాయి నుండి కిందిస్థాయి వరకు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలానే వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడిస్తోందన్నారు. కోదాడలో దళిత బిడ్డ కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారకులన్నారు. ప్రశ్నించే గొంతుకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణగదొక్కుతుందన్నారు. రాజేష్ మృతికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నకిరేకల్లో స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక, మట్టి రవాణా యదేచ్ఛగా చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కి తెలంగాణలో మళ్లీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తీసుకురావడం ఖాయం అని ఆయన పేర్కొన్నారు.