భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టేట్ పేరుతో రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది బాధితులు శనివారం భువనగిరి పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఖాజీమొహల్ల కాలనీకి చెందిన మహ్మద్ షాకీర్ 2018లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్రమంలో భువనగిరి, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని, దాంతో అధిక డబ్బులు సంపాదించవచ్చని కువైట్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డ తన స్నేహితుడైన అబ్దుల్ రహమాన్ను నమ్మించాడు. మొదట కొంత మొత్తంలో తీసుకున్న డబ్బుకు ప్లాట్లు, భూములు అతని పేరు మీద చేయించి నమ్మేలా చేసి సుమారు రూ.30 కోట్లను రహమాన్తోపాటు వారి అన్నదమ్ముల వద్ద తీసుకున్నాడు. అంతేకాకుండా భువనగిరి పరిసర ప్రాంతంలో తను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుందని వరంగల్, నల్లగొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన స్నేహితులను నమ్మించి ఒక్కో కుటుంబం వద్ద లక్ష నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశాడు. మొత్తం 500 మంది వద్ద 400 కోట్ల రూపాయల వరకు తీసుకున్నాడు. అయితే.. షాకీర్కు అప్పు ఇచ్చిన బాధితులు తమ ఆస్తులు ఏవని, తమ వాటాలు తమకు కావాలని కొన్ని రోజులుగా అడుగుతుండడంతో తన పెట్టుబడిదారుడు కువైట్లో ఉంటున్నాడని నమ్మిస్తూ జరుపుతున్నాడు. తమ డబ్బు ఇవ్వాలని కొద్ది రోజులుగా షాకీర్పై ఒత్తిడి తేగా.. కువైట్లో ఉంటున్న రహమాన్కు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన రహమాన్ కువైట్ నుంచి వారం రోజుల క్రితం భువనగిరికి వచ్చాడు. తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని షాకీర్ను రహమాన్ అడుగగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రహమాన్ భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు షాకీర్ తన స్నేహితుల వద్ద తీసుకున్న డబ్బు రహమాన్కు ఇచ్చానని, అడిగితే తప్పించుకుంటున్నాడని రహమాన్పై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో షాకీర్ తమ వద్ద డబ్బు తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డాడని బాధితులు పేర్కొన్నారు. కువైట్లో ఉన్న రహమాన్ గురించి తమకు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. తమ డబ్బు ఇప్పించాలని షాకీర్కు డబ్బులిచ్చి మోసపోయిన రఫేత్, నాజర్, జబీర్, జలీల్, ఎండీ వాసీన్, ఎండీ అజీమ్, ఎండీ సలావుద్దీన్, రషీద్, రఫీక్తోపాటు పలువురు కోరారు.