చెన్నై : భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ తెలిపింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు పిల్లలకు పాజిటివ్గా తేలింది.
పిల్లల కారణంగా అందరికీ వైరస్ వ్యాపించింది. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం ఓ పీడకలలా గడిచింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి’ అని ప్రీతి ట్వీట్లలో సూచించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ సీజన్కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో లీగ్ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్ అశ్విన్. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.