న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న వేళ పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా వ్యాక్సిన్కు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో 18-44 ఏండ్ల వయసువారికి వ్యాక్సినేషన్ను (మూడో దశను) శనివారం నాడు ప్రారంభించలేమని నిస్సహాయత వ్యక్తం చేశాయి. ఈ గ్రూపు వయస్కులు కేవలం రెండు రోజుల్లోనే కొవిన్ పోర్టల్లో 2.45 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సరిపడా వ్యాక్సిన్ డోసులు లేవని, శనివారం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరవద్దని ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. స్టాకు లేనందున మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ను నిలిపివేస్తున్నట్టు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గురువారం ప్రకటించింది. 18-44 గ్రూపునకు వ్యాక్సినేషన్ కూడా వాయిదా వేయక తప్పడం లేదని తెలిపింది. వ్యాక్సిన్ డోసులు ఎప్పుడొస్తే అప్పుడు 18-44 వయస్కులకు టీకాలు వేస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. తయారీదారులు సకాలంలో సరిపడా వ్యాక్సిన్ను సరఫరా చేయలేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 18-44 గ్రూపునకు వ్యాక్సినేషన్ను శనివారం ప్రారంభించడం లేదని తేల్చి చెప్పారు.