షాబాద్, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ యావత్ జాతికి ఆదర్శ ప్రాయులని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడమటి తండా, ఉప్పుగడ్డ తండాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ… సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని బంజరా సోదర సోదరీమణులు ఘనంగా నిర్వహించుకొని ఆయన చూపిన మార్గంలో పయనించడం గొప్ప విషయమన్నారు. ఫలితం ఆశించక పనులు చేయాలని శ్రీ సేవాలాల్ గొప్పగా పిలుపునిచ్చారన్నారు. గిరిజన తండాలు, హరిజన వాడలు బాగు పడాలని సీఎం కేసీఆర్ ఎస్టీ, ఎస్టీ సబ్ప్లాన్ తీసుకువచ్చి, వారి నిధులు పూర్తిగా వారికే దక్కేలా, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారా భవన్ను నిర్మిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో బంజారా భవన్కు స్థలం, నిధులు కేటాయించారని, ప్రస్తుతం నిర్మాణం పూర్తి కావొస్తున్నదని చెప్పారు. మహేశ్వరం మండలంలో బంజారా భవన్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మా గ్రామంలో మా పాలన’ నినాదాన్ని సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. స్వరాష్ట్రం స్వపాలన దిశలో ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సోదరులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.