ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువుల్లా మారుతున్నాయి రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ అంబులెన్స్లు. ప్రత్యేక ఐసీయూతో సహా అన్ని వసతులున్న ఈ వాహనాలు క్షతగాత్రులు, రోగులు, గర్భిణుల పాలిట వరంగా మారాయి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే క్షణాల్లో వచ్చి ఒకవైపు చికిత్స అందిస్తూనే త్వరితగతిన దగ్గరలోని దవాఖానలకు తరలించి ప్రజల మన్ననలు పొందుతున్నారు అంబులెన్స్ సిబ్బంది. ఇంతటి ప్రాధాన్యమున్న 108 వాహనాలను మరిన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఇటీవల మంత్రి కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్కు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జిల్లాకు 8 అంబులెన్స్లను బహూకరించారు. వీటితో కలిపి జిల్లాలో 27 అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 10 : రోడ్డు ప్రమాదం జరిగినా…గుండె నొప్పి వచ్చినా..పురిటినొప్పులతో ఉన్న గర్భిణులను ప్రసవానికి తీసుకెళ్లాలన్నా.. 108వాహనాలు సంజీవినిగా పనిచేస్తున్నాయి. ఆపదలో ఉన్నవారికి అత్యవసర వైద్యం అందిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానలకు నిమిషాల్లో చేరుస్తూ అనేకమంది ప్రాణాలు కాపాడుతున్నాయి. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలందిస్తున్నది. ఈ క్రమంలో 108అంబులెన్సులు ఎందరినో ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 19అంబులెన్సులతో పాటు ఇటీవల కేటీఆర్ నూతనంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద 8 అందజేశారు. మొత్తంగా జిల్లాలో 27 108 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలు జిల్లాలోని అన్ని మండలాల్లో సంచారం చేస్తున్నాయి. గడిచిన అక్టోబర్ నెలలో వీటి ద్వారా 4000 మందికి వివిధ రకాల వైద్య సేవలందించినట్లు 108జిల్లా ఇన్చార్జి రమేశ్ తెలిపారు. ఒక్కో వాహనంలో పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, అందుబాటులో ఉంటూ షిప్టుల వారీగా సేవలందిస్తున్నట్లు తెలిపారు.
గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా మంత్రి కేటీఆర్ అంబులెన్సుల బహూకరణ..
మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద 8 అంబులెన్స్లను అందజేశారు. జిల్లాలో ఈ అంబులెన్సులు దసరా పండుగ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో ఘటనా స్థలాలకు చేరుకుని ప్రథమ చికిత్స అందించి బాధితులను దవాఖానల్లో చేరుస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 108సేవలు దేశంలోనే ప్రశంసలందుకుంటున్నాయి. కేటీఆర్ పిలుపు మేరకు పలువురు దాతలు ముందుకువచ్చి అంబులెన్సులు అందజేయడంతో ఈ నూతన వాహనాల ద్వారా మరింత సేవలు అందుతున్నాయి.
ప్రత్యేక సేవలు..
అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందించడంతో పాటు ఆక్సిజన్ మెడిసిన్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవల్ ఏఈడీ, బీపీ ఆపరేటర్, పల్స్ పరీక్షించడానికి ఆధునిక వైద్య పరికరాలతో పాటు ప్రసవం చేయడానికి ఎమర్జెన్సీ డిస్పోజబుల్ డెలివరీ కిట్ను అందుబాటులో ఉంచారు. ప్రసవాలు చేసే సమయంలో ఇబ్బందులు కలిగితే మానిటర్ ద్వారా కాల్ సెంటర్లోని ఈఆర్పీని సంప్రదించి రోగి పరిస్థితిని తెలుసుకుని అవసరమైర వైద్య సలహాల మేరకు చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలో 132మంది సిబ్బంది..
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంబులెన్స్ల్లో 132మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్న వీరిలో 64మంది పైలట్లు, 64మంది ఈఎంటీలతో పాటు మరో నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు 108 ఎమర్జెన్సీ వాహనంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా, అనారోగ్యాలపాలైనా, పురుటినొప్పులతో బాధపడుతున్న వారందరికీ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని దవాఖానలకు తరలిస్తున్నారు.
ఈఎంటీ, పైలెట్లకు శిక్షణ..
108ఎమర్జెన్సీ వాహనంలో గర్భిణులను దవాఖానలకు తరలించే సమయంలో అత్యవసరంగా ప్రసవం చేయాల్సి వస్తున్నది. ఇందుకోసం డిస్పోజబుల్ డెలివరీ కిట్ అందుబాటులో ఉంచారు. వీటిని ప్రతినెలా మారుస్తూ ఉంటారు. జీఎన్ఎం, ఎన్ఎంలుగా సైన్స్ గ్రూప్ వారినే ఈఎంటీలుగా ఎంపికచేశారు. వీరికి 45రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణులకు ప్రసవాలకు సంబంధించి చికిత్సపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం 15రోజులు ప్రభుత్వ దవాఖానల్లో శిక్షణ ఇప్పిస్తారు. తర్వాత అంబులెన్స్ల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ 108 ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాయని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ప్రతిక్షణం అందుబాటులో సిబ్బంది
జిల్లాలో 27 ఎమర్జెన్సి అంబులెన్స్ వాహనాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. 132మంది సిబ్బంది అందుబాటులో ఉంటూ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి దవాఖానకు తరలిస్తున్నారు. నూతనంగా మంత్రి కేటాయించిన గిఫ్ట్ ఏ స్మైల్ వాహనాలతో మరింత సేవలు అందిస్తున్నాం. ప్రతిక్షణం సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.
అత్యవసర సేవలు అందిస్తున్నాం
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన వైద్య పరికరాలతో పాటు సిబ్బందికి పరిజ్ఞానాన్ని అందించారు. అత్యవసర సమయాల్లో ప్రసవాలు చేయడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో కేవలం అక్టోబర్ నెలలో సుమారు 998మందికి ప్రసవాలు అంబులెన్స్లో నిర్వహించాం. మిగతా సుమారు 3200మందికి ఇతర వైద్య పరీక్షలు అందించాం.