ధర్మసాగర్ : గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వల్లెపు రమేష్ అధ్యక్షతన పక్కా గృహాలు మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..మండలంలోని ముప్పారం గ్రామంలో సర్వే నెంబర్ 585 లో గల 5 ఎకరాలు 20 గుంటల భూమిలో గత మూడు సంవత్సరాలుగా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన 250 మంది నివాసముంటున్నారని అన్నారు. ఈ నిరుపేదలైన వారికి ఇండ్ల పట్టాలిచ్చి, పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపక్షంగా నిలబడలని, లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం మెమోరండాన్ని తాసిల్దార్ సదానందంకు అందించారు. సానుకూలంగా స్పందించిని తహసీల్దార్ అక్కడున్న భూమిని సర్వే చేయించి నివేదికను పై ఉన్నతాధికారులకు చేరవేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుక రాఘవులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు వేలు రజిత, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలులావణ్య, పప్పీ తదితరులు పాల్గొన్నారు.