మరో 1,000 మంది కార్మికులను పనిలో పెట్టాలి
వర్క్ ఏజెన్సీకి మంత్రి వేముల ఆదేశం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): నూత న సచివాలయంలో రెడ్స్టోన్ కట్టడం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు రాజస్థాన్ నుంచి మరో 50 మంది మేస్త్రీలను రప్పించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. పనులన్నింటినీ సమాంతరంగా, నిర్ణీత గడువులోగా పూర్తిచేయడానికి మరో వేయి మంది నిపుణులైన కార్మికులను సమకూర్చుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జీఆర్సీ క్లాడింగ్ వర్క్ నిపుణులను వెంటనే రప్పించి రౌండ్ పిల్లర్ల నగిషీల పనులను పూర్తి చేయాలని చెప్పారు.
గ్రానైట్, ఫ్లోరింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. యూపీవీసీ విండో, ఫాల్ సీలింగ్, విద్యు త్తు, ప్లంబింగ్ పనులతో పాటు మిగిలి ఉన్న సివిల్ పనులను సమాంతరంగా చేపట్టాలని, వీటిని ఆర్ అండ్ బీ ఇంజనీర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్కు సంబంధించిన రెయిలింగ్ పనులను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మొత్తం 32 డోమ్లకు గాను 16 డోమ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 8 డోమ్ల స్ట్రక్చరల్ పనులు పూర్తయ్యాయని వివరించారు. సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణంలోని ప్రార్థనా మందిరాల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. గుడి, మసీదు, చర్చి, సెక్యూరిటీ బ్లాక్, ఆన్సిలరీ బిల్డింగ్ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ పాల్గొన్నారు.