Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ఉద్వేగానికి లోనవుతున్నారని, ఆయన వేదికపైనే కన్నీళ్లు కార్చే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గత పదేండ్లుగా ప్రధాని మోదీ పేదల సొమ్మును వారి నుంచి లాగేసుకుంటున్నారని ఆరోపించారు. కర్నాటకలోని బీజాపూర్లో శుక్రవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ దేశంలో 70 కోట్ల మంది జనాభా వద్ద ఉన్న ఆస్తికి సమానమైన సంపదను మోదీ కేవలం 22 మంది బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని అన్నారు.
దేశంలో కేవలం ఒక శాతం మంది 40 శాతం సంపదను నియంత్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగం, ధరల మంటను నియంత్రించి ఆర్ధిక వ్వవస్ధలో అందరినీ భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ బిలియనీర్లకు నిధులు కట్టబెడితే తాము దేశంలోని పేదలకు నగదును అందచేస్తామని భరోసా కల్పించారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేసిందని అందుకే రాష్ట్ర ప్రజలు అధిక ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ కేవలం కొద్దిమందిని బిలియనీర్లను చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది ప్రజలను లక్షాధికారులుగా తయారుచేస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రెండో దశలో భాగంగా ఇవాళ కర్నాటకలోని 14 స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్ మూడు స్ధానాల్లో పోటీ చేస్తోంది. మాండ్యా, హసన్, కోలార్ స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు బరిలో నిలిచారు.
Read More :