PM Modi | రాంచీ/దర్భంగా, మే 4: దేశంలో ఉగ్రవాద సమస్యపై గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాకిస్థాన్ పట్ల బలహీనంగా వ్యవహరించాయని, ఓవైపు దేశంలో ఉగ్రదాడులు జరుగుతుంటే, కాంగ్రెస్ సర్కార్లు మాత్రం పాక్కు ‘ప్రేమ లేఖలు’ పంపాయని విమర్శించారు. శాంతి కోరుతూ పంపిన లేఖలకు.. సమాధానంగా పాక్ నుంచి మరింత మంది ఉగ్రవాదులు వచ్చారని అన్నారు. శనివారం జార్ఖండ్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం పట్ల తాము కఠినంగా ఉన్నామని అన్నారు.
బీహార్లో మోదీ మాట్లాడుతూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. గోద్రా రైలు దహనం ఘటన కేసులో నిందితులను కాపాడేందుకు లాలూ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. రైల్వే మంత్రిగా లాలూ.. గోద్రా ఘటనపై విచారణ కమిటీ వేశారని, భయంకరమైన నేరానికి పాల్పడిన వారిని నిర్దోషులుగా ప్రకటించే నివేదికను రూపొందించారని అన్నారు.