న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనున్నదని, దీంతో రుణ గ్రహీతలకు ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నట్టు పేర్కొంది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్క రోజు, నెల రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8 శాతానికి దిగిరాగా, మూడు నెలల రుణాలపై రేటు 8.20 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గగా, ఆరు నెలల రుణాలపై రేటు 8.35 శాతం నుంచి 8.30 శాతానికి, ఏడాది రుణాలపై రేటు 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించినట్టు వెల్లడించింది.
రెండేండ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీరేటును యథాతథంగా 8.55 శాతంగా ఉంచింది. కానీ, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 8.70 శాతం నుంచి 8.65 శాతానికి దించింది. తగ్గించిన వడ్డీరేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయని తెలిపింది. దీంతో ఎంసీఎల్ఆర్ 8 శాతం నుంచి 8.65 శాతం మధ్యలోకి తగ్గాయి.