Tech Talk | ఒకప్పుడు కాలక్షేపం అంటే ఆటలు, పాటలు, నాటికలు ఇలా ఉండేవి! మరిప్పుడో.. ఒకే సమాధానం స్మార్ట్ఫోన్. బండ సెల్ఫోన్ రింగ్టోన్ విని ఏడుపు మానేసిన జనరేషన్ జెడ్ ఇప్పుడు స్మార్ట్ దునియాలో చక్కర్లు కొడుతున్నది. వాళ్లు ఎదిగే కొద్దీ… సాంకేతికత కొత్తపుంతలు తొక్కింది. డబ్బా ఫోన్ కాస్తా ఇస్మార్ట్గా మారిపోయింది. కానీ, మితిమీరిన పరిజ్ఞానం ఈ తరాన్ని ఊర్రూతలు ఊగించడం మాట అటుంచితే.. వారి ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సాంకేతిక చట్రంలో ఇరుక్కొన్న జనరేషన్ జెడ్కు ఉపశమనం డిజిటల్ వెల్బీయింగ్ ఉపదేశమే!
యాభై ఏండ్లు వెనక్కి వెళ్తే.. అప్పటి తరానికి ‘ఆకాశవాణి వార్తలు చదువుతున్నది..’ అని వార్తలు పద్ధతిగా అందేవి. పాతికేండ్ల కిందట దూరదర్శన్ ద్వారా దురభిప్రాయాల పొడ చూడని వార్తలు కనిపించేవి. ఈ తరం దగ్గరికి వచ్చేసరికి వారికి న్యూస్ కన్నా వ్యూస్ ఎక్కువ వేగంగా చేరుతున్నాయి. కుప్పలు తెప్పలుగా వస్తున్న తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మి చాలామంది ముప్పుల పాలవుతున్నారు. మతాలను కించపరిచేలా వ్యాఖ్యానాలు, చరిత్రను వక్రీకరిస్తూ భాష్యాలు, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా సందేశాలు, వైరల్ మాయలో అసభ్యకరమైన రీల్స్ ఇవీ జనరేషన్ జెడ్ రోజంతా చూస్తున్న, చదువుతున్న విషయాలు. ఏది మంచో, ఏది చెడో అర్థం చేసుకోలేకపోతే.. యంగ్ హిందుస్థాన్ ఐడియాలజీ విపరీతాలకు దారితీసే ప్రమాదం ఉంది.
బాధ్యత లేకుండా చేసే పని పతనానికి కారణం అవుతుంది. చేసే పనిమీద అవగాహన, అందుకు ఎంచుకున్న మార్గంపై సాధికారత ఉన్నప్పుడే ఆ పని విజయవంతం అవుతుంది. అవగాహన లేమితో డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ అయితే.. పొందే ప్రయోజనాల కన్నా, ప్రమాదాలే అధికంగా ఉంటాయి. అందుకే డిజిటల్ వెల్బీయింగ్ (సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడటం) అలవర్చుకుంటే తప్ప ఈ సైబర్ వైతరణిని సులభంగా దాటలేం. అందుకు కొన్ని సూత్రాలు ఇవి..