చంపాపేట : పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (MLA Devi Reddy Sudhir Reddy) ) అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని సాయిరాంనగర్ కాలనీ పార్కు, డిఫెన్స్ కాలనీ పార్కుల్లోని వాకర్స్తో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వాకింగ్, యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్తో ఆయన మాట్లాడారు.
స్థానికేతరులను గెలిపిస్తే ఢిల్లీ నేతల (Delho Leaders) ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తారని, స్థానికులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 11 డివిజన్లలో పార్కులు ఏర్పాటు ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే కోటాలో వచ్చే నిధులకు, ఎంపీ నిధులు తోడయితే నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగామార్చి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి అధికారం చేజిక్కించుకుని ప్రజలను సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిజస్వరూపమేంటో నాలుగు మాసాల్లోనే ప్రజలు తెలుసుకుని బీఆర్ఎస్ (BRS) ను తిరిగి ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్రెడ్డి, సీనియర్ నేత గజ్జల మధుసూదన్రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.