సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి తెలిపారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీపీ పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళి పరిధిలోనే పనిచేయాలని, ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా.. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో జిల్లా సరిహద్దులు, పార్లమెంట్ నియోజకవర్గ సరిహద్దులు, ఇతర అవసరమైన చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమంగా తరలించే డబ్బు, మద్యం.. వంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహంతో పని చేయాలన్నారు.
సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా.. అవసరమైన అన్ని మౌలిక వసతులను ముందుగానే పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. రౌడీషీట్స్, సస్పెక్టడ్ షీట్స్, హిస్టరీ షీట్స్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు, పోస్టులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో పాటు అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజేశ్ చంద్ర, పద్మజ, సునీతా రెడ్డి, ప్రవీణ్కుమార్, ఇందిర, కరుణాకర్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.