చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించిన అనంతరం హైకమాండ్ నిర్ణయంపై చన్నీ స్పందించారు. సరికొత్త ఉత్సాహం, అంకితభావంతో పంజాబ్ను, రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకువెళతానని స్పష్టం చేశారు. తనపై విశ్వాసం ఉంచిన కాంగ్రెస్ హైకమాండ్తో పాటు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పంజాబ్ అభివృద్ధికి 111 రోజులుగా తాను కష్టపడి పనిచేస్తున్నానని..ఇక సరికొత్త ఉత్సాహం, అంకితభావంతో పంజాబ్ను, పంజాబ్ ప్రజలను ప్రగతిపధంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
లుధియానాలో జరిగిన వర్చువల్ ర్యాలీలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా రాహుల్ గాంధీ తన పేరును ప్రకటించారని, పేదింటికి చెందిన సీఎం కావాలని పంజాబీలు కోరుకున్నారని చన్నీ చెప్పారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిత్వం కోసం చన్నీతో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత సునీల్ జాఖడ్ పోటీ పడ్డారు. కాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంతకుముందు లుథియానాకు చేరుకోగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ, సీనియర్ నేత సునీల్ జాఖడ్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడే రాహుల్ వీరందరికీ చెన్నీయే సీఎం అభ్యర్థి అని చెప్పినట్లు సమాచారం. అటు సిద్దూను, ఇటు సునీల్ జాఖడ్ను రాహుల్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే సిద్దూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎవరైనా తాను కలిసే పనిచేస్తానని, రాహుల్ గాంధీ మాట జవదాటనని సిద్దూ సభలో ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.