ద్యావనపల్లిగారి వాదాన్ని ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారిగారు పూర్వపక్షం చేస్తూ రామప్ప-శిల్పి పేరు కాదనడం శాస్త్రీయం కాదన్నారు. అయితే సుబ్బాచారిగారు చెప్పింది మాత్రం శాస్త్రీయం ఎలా అయింది!?
జానపదుల్లో నోటిమాట ద్వారా తరం నుంచి తరానికి ఒక సమాచారం వస్తే దాన్ని శాస్త్రీయ ఆధారం కాదని కొట్టివేయడం సరైన పద్ధతి కాదు.. నిజమే! అయితే కేవలం జానపదుల్లో నోటిమాట ద్వారా తరం నుంచి తరానికి ఒక సమాచారం వచ్చినంత మాత్రాన అది శాస్త్రీయ ఆధారం ఐపోతుందా?
అన్ని మౌఖిక ఆధారాలను శాస్త్రీయ ఆధారంగానే పరిగణిస్తారా!‘Oral tradition and historical methodology’ అనే గ్రంథంలో ఇదే రాసి ఉందా! సుబ్బాచారిగారే చెప్పినట్టు వాటిలో యథార్థం కావడానికి ఏయే అంశాలు పనికి వస్తాయో చూడాల్సి ఉంటుంది. లేకపోతే కబీరు, రామదాసుల కలయిక, రాయలు, ధూర్జటుల సమకాలీనత.. ఇలా చాలా విచిత్ర విషయాలు చారిత్రకంగా నిర్ణయింపబడిన శతాబ్దుల అంతరాలను కూడా అధిగమించి నిజమై కూచుంటాయి.
సుబ్బాచారి గారు అసలు శిల్పి అనే వాడు లేకుంటే జానపదుల కథలో ఎలా వస్తాడు అంటున్నారు. ఈ లెక్కన చిత్రాంగి, సారంగధరుడు నిజమైపోతారు. అంటే వాళ్ళు నిజం కాకూడదని కాదు.., ప్రస్తుతానికి వాటికి ఏ రకమైన ఆధారాలు లేవని.
అలాగే ద్యావనపల్లి గారు ఒక ఊహ చేశారు. రామలింగేశ్వరాన్నే రామప్ప ఆలయం అని ఉంటారు అని. దీనికి సుబ్బాచారిగారు చెప్పిన అభ్యంతరం ఏమంత పరిగణించదగ్గది కాదు. రామలింగేశ్వరాన్ని రామలింగప్ప గుడి అనే వ్యవహరించి ఉండాలని ఎక్కడ ఉంది! జనాల పలుకుబడులు అనేక విధాలుగా మారుతుంటాయి. రామేశ్వరం, సోమేశ్వరం, మందేశ్వరం వీటిలో ఎక్కడా లింగశబ్దం రాలేదు. అంటే దానర్థం రామప్ప శిల్పి కాదు అని చెప్పడం కాదు. ఏవైనా ఊహలే అని! కానీ శిల్పి పేరు కాదు అనడం ఎంత శాస్త్రీయమో/అశాస్త్రీయమో.. శిల్పి పేరే అనడం కూడా అంతే శాస్త్రీయం/ అశాస్త్రీయం. ప్రస్తుతానికి ఇంతే!
సమ్మక్క, సారలమ్మ చారిత్రక వ్యక్తులు కారని చెప్పగలరా.. అని అడిగితే సమ్మక్క, సారలమ్మ చారిత్రక వ్యక్తులు అని చెప్పగలరా అనేదే సమాధానం. ఒకరు చారిత్రక వ్యక్తులు అని చెప్పాల్సివస్తే వారి దేశ కాలాలు చెప్పాల్సి ఉంటుంది. సుబ్బాచారి గారే చెప్పినట్టు కల్పనను, పురాసృజనను తీసి వేస్తే వీరి విషయంలో ప్రస్తుతానికి ఏమీ మిగలదు. చరిత్రకారులు కోరుకునే శాసనాలు, నాణేలు, రాతప్రతులు, తాళపత్రాలు ఏవీ దొరకవు కాబట్టి.. వారు రాముడు, లక్ష్మణుడు లాగా ప్రస్తుతానికి పౌరాణిక వ్యక్తులే!
జానపద స్రోతస్సులో తరాల నుంచి వస్తున్న ప్రతిదీ సమాచారం ఐపోదు. ఒక విషయాన్ని అశాస్త్రీయం (అన్సైంటిఫిక్) అనటమే తనంత తానుగా శాస్త్రీయం (సైంటిఫిక్) ఐపోదు. ఆధునిక చరిత్ర నిర్మాణ పద్ధతి ఇది కాదు. నిరూపించింది నిరూపించినట్టుగానూ, జనాలు అనుకుంటున్నది అనుకుంటున్నట్లుగానూ, ఊహలను ఊహలుగానూ.. యథాతథంగా చెప్పి మిగిలినది భావి చరిత్రకారులకు వదిలిపెట్టడమే ఆధునిక చరిత్ర నిర్మాణ పద్ధతి.
డాక్టర్ ఇంద్రకంటి పినాకపాణి
93666 10746