-మన సామెతలు
కాలం విలువను తెలుసుకోకుండా బాధలు, సమస్యల గురించే నిత్యం ఆలోచిస్తూ ఆత్మహత్యలవైపు పరుగెత్తే వారిని ఉద్దేశించిన సామెత ఇది. శవాన్ని చితి ఎలా దహించివేస్తుందో.. బతికున్న మనిషిని చింత (బాధ) అలా దహిస్తుందని అనుభవపూర్వకంగా చెప్పారు జానపదులు. ఎన్ని సమస్యలు వచ్చినా.. చిరునవ్వుతో స్వాగతించి, చిరునవ్వుతో సాగనంపాలంటారు మానసిక నిపుణులు. సమస్య వచ్చింది కదా అని.. పొద్దస్తమానం దానిగురించే ఆలోచిస్తే తిండి ఒంటబట్టదు, నిద్రరాదు. అవే ఆలోచనల్లో మునిగితేలుతుంటే చావొక్కటే పరిష్కారం అని పిస్తుంది. అందుకే.. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. నీతి తప్పినప్పుడే చింతలొస్తాయి. అందుకే ‘మనాదికి మందులేదు’ అని అన్నారు పెద్దలు. ‘చింతలేనోడు సంతలో పండిండట’ అని కూడా అన్నారు. ప్రతిదీ మనసుకు ఎక్కించుకోకుండా.. సరదాగా, సంతోషంగా బతకాలి.