హుజూరాబాద్ : దళితులకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళితబంధును ఆపింది బీజేపీనేనని రుజువు చేయడానికి రెడీగా ఉన్నానని ఏ బీజేపీ నాయకుడు వస్తడో రండి అని ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. బుధవారం జమ్మికుంటలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి దళితబంధు డబ్బులు వస్తే టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని ఈ నెల 7న లేఖ రాస్తే, ఈ నెల 30 వ తేదీ వరకు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని హరీశ్రావు తెలిపారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడి. కాదనుకున్న తెలంగాణను తెచ్చిపెట్టింది కేసీఆర్. తెచ్చుకున్న తెలంగాణలో 200 పెన్షన్ 2016 రూపాయలు చేసుకున్నం. ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మి అని లక్షా నూటపదహార్లు ఇస్తున్నం. ఈ రోజు దళితబంధు వచ్చింది. రేపు అన్ని కులాలకు వస్తది అని హరీశ్రావు అన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది వారి పాలనలో 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిండ్రు. అందుకే బీజేపీ పార్టీ జీడీపీగా అంటే గ్యాస్, డిజీల్, పెట్రోల్ ధరలు పెంచే పార్టీగా పేరు మార్చుకోవాలి అన్నారు. అలాంటి బీజేపీలో రాజేందర్ చేరిండు. ధరలు తగ్గిస్తానని ఆయన చెప్పగలరా అని హరీశ్ ప్రశ్నించారు. రాష్ట్రమంతా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తే మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కట్టివ్వని ఈటల రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కట్టిస్తాడా ఆలోచించండి అని మంత్రి అన్నారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే నేను దగ్గరుండి ఇండ్లు కట్టిస్తానని హమీ ఇచ్చారు.
పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి జమ్మికుంట సమస్యలన్నీ మా మీద పెట్టండి పరిష్కరిస్తా మని ఆయన మాటిచ్చారు. రాజేందర్ గెలిస్తే బీజేపీకి లాభమని, గెల్లు గెలిస్తే ఇక్కడి ప్రజలకు లాభమని, ఏడేండ్లుగా ఈటల చేయని పనులన్నీ రెండెండ్లలో చేసి చూపిస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. ఈటల అగ్గిపెడతా.. కూలగొడతా…ఘోరీ కడతా…. అంటున్నడు తప్ప సేవ చేస్తా అంటున్నడా.. తిడితే కడుపు నిండుతదా.. గ్యాస్ ధర తగ్గిస్తవేమో చెప్పు అని ఈటలను ప్రశ్నించారు. ఎన్నికల మరునాటి నుంచే మిగిలిన వారందరికీ దళితబంధు వస్తుందని, తాము దగ్గరుండి దళితులందరికీ యూనిట్లు గ్రౌండ్ చేయిస్తామన్నారు.
ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు : మంత్రి కొప్పుల ఈశ్వర్
ఇరవై ఏండ్ల నుండి ఇక్కడి ప్రజలు కారు గుర్తుకు ఓటువేసి టీఆర్ఎస్ వెంట ఉన్నరు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు వదులుకోలేదని , ఈటల మాత్రమే వదులు కున్నాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదని అన్నారు.
రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, సంఘ భవనాలు లేవు, ఇళ్ల పట్టాలు లేవు, పెన్షన్ లెేవు, కొత్త కార్డులు లేవు. ఇక్కడ అంతా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉందని కొప్పుల ఆవేదన వ్యక్తం చేశారు. మేం వచ్చాక అనేక సమస్యలు చెబుతుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నం. రేపు గెల్లును గెలిపిస్తే మిగిలిన పనులు కూడా చేస్తామని హమీ ఇచ్చారు.
ఉద్యమంలో ఎంత నీతిగా పని చేసిన్నో అదే రీతిలో ప్రజలకు సేవ చేస్తా : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పని చేశా. ఇక్కడ చదివి ఉస్మానియా లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. చంచల్ గూడ జైలుకు వెళ్లా..ఈ ఉపఎన్నికల్లో కేసీఆర్ పిలిచి హూజూరాబాద్ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకో. నీ ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. ఉద్యమంలో ఎంత నీతిగా పని చేసిన్నో అదే రీతిలో హుజూరా బాద్ ప్రజలకు సేవ చేస్తా అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నాకు హైదరాబాద్ లో ఆస్థులు లేవు, వ్యాపారాలు లేవు. వేరే వాళ్లకు ఓటు వేస్తే వాళ్లకు పార్ట్ టైం జాబ్… నాకు ఓటు వేస్తే నేను ఫుల్ టైం జాబ్ అని స్పష్టం చేశారు. నేను గెలిస్తే మెడికల్ కాలేజీ, స్టడీ సెంటర్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయిస్తా. నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా, జమ్మికుంటను ఉత్తమ మున్సిపాలిటిగా తీర్చిదిద్దుతా.. హూజూరాబాద్ నుంచి పెద్దపల్లి వరకు 4 లైన్ రోడ్డు వేయించి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయిస్తానని హమీ ఇచ్చారు.