హనుమకొండ, ఫిబ్రవరి 24 : హన్మకొండలోని (వేయి స్తంభాల) శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల గోడ పత్రికను పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలకు పూర్వ వైభవం దక్కిందన్నారు. ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోని దేవాలయాలు కూడా ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు.
యాదాద్రి దేవాలయం అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లనున్నదని మంత్రి చెప్పారు. అత్యంత పురాతనమైన కాకతీయుల నాటి వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం కూడా మహిమాన్వితమైనదని మంత్రి తెలిపారు.
ఈ దేవాలయం మరింత అభివృద్ధికి తాము కృషి చేస్తామని అన్నారు. గొప్ప చరిత్ర ఉన్న వేయి స్థంబాల దేవాలయంలో శివరాత్రి పండుగ రోజు జరిగే బ్రహ్మోత్సవాలకు దేవాదాయశాఖతో పాటు ఇతర అన్ని శాఖల ద్వారా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్రావు, గాయత్రి గ్రానైట్ వ్యాపారవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, దేవాలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, స్థానిక కార్పొరేటర్ చీకటి శారద, పులి రజినీకాంత్, రాచర్ల జగన్, తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు మంత్రి, చీఫ్ విప్ లకు దేవాలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి రుద్రేశ్వరాలయంలో పూజలు చేశారు.