ఖమ్మం: ఖమ్మంలో (Khammam) గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. 9 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు అంతరాయం కలిగింది. బోనకల్ మండలం పందిళ్లపల్లి వద్ద విద్యుత్ టవర్ కూలిపోయింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చింతకాని, నాగులవంచలో విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా వర్షం కురియడంతో నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో ఊరట కలిగింది.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదురోజులపాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేరొన్నది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మరోవైపు పలు ప్రాంతాల్లో వడగాలులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో అకడకడా వర్షం కురిసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , వరంగల్, హనుమకొండ, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో అకడకడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేరొంది. మంగళవారం సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.