Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి బిజేపీ అభ్యర్థిగా కంగన పోటి చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంకు సంబంధించి తాజాగా ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టింది ఈ భామ.
వరుస రోడ్షోలతో పాటు.. ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు.. పర్వత ప్రాంతాల్లో కష్టమైన రోడ్లపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల ప్రయాణం.. నిద్రలేని రాత్రులు.. సమయానికి తీసుకోని భోజనం.. ఇవన్నీ చూసిన తర్వాత నాకో విషయం తెలిసింది. సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టం. ఈ కష్టమైన పోరాటం ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఒక జోక్ లాంటివి అంటూ రాసుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారతప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కావాల్సి ఉండగా.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.