ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. తన ఫక్తు రాజకీయ ప్రసంగంతో దానిని బీజేపీ కార్యక్రమంలా మార్చివేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై, ఆయన కుటుంబంపై ఎప్పుడూ చేసే పస లేని ఆరోపణలతోపాటు, ఈసారి కొత్తగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని కూడా అన్నారు.
కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా నవ్వుకునే మాట ఇది. తెలంగాణ మీద కక్ష గట్టినట్టు వ్యవహరిస్తూ, అప్పు కూడా పుట్టకుండా ఆంక్షలు విధిస్తున్న వారి నోట ఇటువంటి మాట వింటే కలియుగం అంటే ఇలాగే ఉంటుందనుకోవాలేమో! పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోయినా సరే, మోదానీ మీద మాత్రం జేపీసీ వేయటానికి వీల్లేదంటూ భీష్మించుక్కూర్చున్న వారి నోట, అవినీతి వ్యతిరేక పోరాటం మాట వింటుంటే గురివింద గింజ సామెత గుర్తుకు రాకమానదు.
యూపీఏ హయాంలో మంజూరైన హైదరాబాద్ మెట్రోను తామే ఇచ్చామని చెప్పుకోవటం ప్రధానమంత్రికి మర్యాదేనా? ఆ ప్రాజెక్టులో కేంద్రం వాటా పది శాతమే. అదీ పూర్తిగా ఇచ్చింది లేదు. మిగిలినదంతా తెలంగాణ ప్రభుత్వ వ్యయమే. కానీ, మెట్రోను కేంద్రమే పూర్తి చేసిందన్నట్లుగా మోదీ మాటలున్నాయి. రాష్ర్టానికి టెక్స్టైల్ పార్కును ఇచ్చామని చెప్పుకోవటం కూడా ఇటువంటిదే. టెక్స్టైల్ పార్కు ను మంజూరు చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేస్తే, నాన్చీ నాన్చీ ఇప్పుడిచ్చిన ప్రధాని దాన్నీ గొప్పగా చెప్పుకొన్నారు. ఇక ఐదేండ్ల కిందట మంజూరై, 10 నెలల క్రితమే పనులు ప్రారంభించిన బీబీనగర్ నిమ్స్ కు కొత్తగా శంకుస్థాపన చేయటం ఏమిటో వారికే తెలియాలి.
తెలంగాణ అభివృద్ధి చెందాలని ప్రధాని నిజంగానే మనసారా కోరుకుంటే అది ఆయన చేతల్లో ఇప్పటికే.. ఈ తొమ్మిదేండ్లలో జరిగి ఉండేది. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపే ముందు, తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏమిటో, తెలంగాణ ప్రభుత్వం స్పందన ఏమిటో తెలుసుకొని ఉండేవారు. కానీ, అటువంటి ప్రయత్నమే చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించేవారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టు ఐటీఐఆర్ను హైదరాబాద్కు ఇస్తామన్న కేంద్రం వాగ్దానాన్ని అమలు చేసేవారు. మిషన్ భగీరథ వంటి అద్భుతమైన పథకానికి కేంద్రం నిధులు ఇవ్వాలని స్వయంగా 15వ ఆర్థికసంఘం చేసిన సిఫారసును ఆచరణలో పెట్టేవారు. కరువు కాటకాల తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న విజయగాథను దేశమంతటా చాటి చెప్పేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఖ్యాతిని విశ్వవేదికలపై ప్రస్తావించేవారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అన్ని రంగాల్లో గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణను భుజం తట్టి ప్రోత్సహించేవారు. ఇవేవీ జరుగకపోగా అడుగడుగునా అవమానించే మాటలు, కాళ్లల్లో కట్టెలు. మొన్నటి ప్రసంగం కూడా దానికి కొనసాగింపే. ఇటువంటి అబద్ధాలతో, అసత్య ఆరోపణలతో తెలంగాణ ప్రజలను ఏమార్చలేరు.