న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘నేతాజీ’ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతికి రెండు రోజుల ముందు ఈ ప్రకటన చేశారు. “గ్రానైట్తో చేసిన ‘నేతాజీ’ గ్రాండ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారతదేశం ఆయనకు రుణపడి ఉండేందుకు ఇది చిహ్నంగా నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు.
అయితే, విగ్రహాన్ని నిర్మించే వరకు, దేశ రాజధానిలోని ఐకానిక్ స్మారక చిహ్నం వద్ద ‘నేతాజీ’ హోలోగ్రామ్ ప్రతిమను ఉంచుతామని ప్రధాని మోదీ చెప్పారు. నేతాజీ జయంతి అయిన జనవరి 23న హోలోగ్రామ్ విగ్రహాన్ని తాను ఆవిష్కరిస్తానని అందులో పేర్కొన్నారు. కాగా, నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఉన్న శాశ్వత జ్వాలతో ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల విలీనంపై వివాదం, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
అయితే ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయనున్న నేతాజీ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1968లో తొలగించిన బ్రిటన్ రాజు జార్జ్ V విగ్రహం స్థానంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 24కి బదులుగా జనవరి 23న ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వం గత వారం తెలిపింది. అలాగే, భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) మాజీ కమాండర్ నేతాజీ జ్ఞాపకార్థం ప్రతిఏటా జనవరి 23ను ‘పరాక్రమ్ దివస్’గా పాటిస్తామని గత ఏడాది ప్రకటించింది.