వాషింగ్టన్ : భారత్లో మొదటిసారిగా గుర్తించిన రెండు కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా ఫైజర్, మోడెర్నా టీకాలు ప్రభావంతంగా పని చేస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన కొత్త పరిశోధనలో వెల్లడైంది. భారత్లో రూపాంతరం చెందిన B.1.617, B.1.618 వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయని పరిశోధకులు ఆన్లైన్ పోర్టల్ బయోర్జివ్ డాట్ ఆర్గ్ ( biorxiv.org ) ఆన్లైన్ పోర్టల్ ప్రీ-ప్రింట్ పేపర్లో పేర్కొన్నారు. మరోవైపు దీనిపై మరింత సమీక్ష జరగాల్సి ఉన్నది. అయితే, పరిశోధనల్లో రెండు కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాయని, అయితే ఇది టీకాల రక్షణ సామర్థ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని సీనియర్ రచయిత నాథనియల్ పేర్కొన్నారు.
‘ప్రస్తుతం టీకాలు వేసిన వ్యక్తులు B.1.617, B.1.618 వేరియంట్ల నుంచి రక్షణ పొందుతారని’ న్యూయార్క్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ పరిశోధనా పత్రంలో రాశారు. వాస్తవంగా ప్రపంచంలో ఉన్న వేరియంట్లకు వ్యతిరేకంగా ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకునేందుకు మరింత పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత్లో మొదట గుర్తించిన కరోనా వేరియంట్పై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్కే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని, ఇతర వేరియంట్ల కంటే తేలిగ్గా వ్యాపిస్తోందని చెప్పింది. కొత్తగా జరిపిన పరిశోధనల్లో తొమ్మిది మంది సీరం నమూనాలు సేకరించారు. ఆరుగురు వ్యక్తులకు ఫైజర్ వ్యాక్సిన్, మరో ముగ్గురికి మోడెర్నా టీకాలు పూర్తి స్థాయిలో వేశారు. అనంతరం ఆ శాంపిల్స్పై.. B.1.617, B.1.618 వేరియంట్లను ప్రయోగించారు.
ఈ వేరియంట్లతో పోరాడే విషయంలో రెండు వ్యాక్సిన్ల నుంచి వచ్చిన యాంటీబాడీలు.. మిగతా వేరియంట్లతో పోరాడినంత బలంగా పోరాడలేకపోయినా.. మొత్తంగా యాంటీబాడీలు బాగానే పనిచేసినట్లు ప్రయోగంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఇప్పటి వరకు గుర్తించిన వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని ఫలితాలు విశ్వాసాన్ని ఇస్తున్నాయని, అయితే ఈ వేరియంట్లు మరింత బలంగా మారవు అని కచ్చితంగా చెప్పలేమని పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ఆధారిత పరిశోధనలు ఎన్వైయూ గ్రాస్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఎన్ఓయూ లాంగోన్ సెంటర్లో జరిగాయి.