న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో 4,239 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. మరో వైపు కొత్తగా 2,63,533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఒకే రోజు 4,22,436 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కు చేరింది. ఇప్పటి వరకు 2,15,96,512 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 2,78,719 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 33,53,765 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 18,44,53,149 డోసులు వేసినట్లు వివరించింది. మరో వైపు దేశంలో కరోనా పరీక్షలు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 18,69,223 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 31,82,92,881 టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది.