న్యూఢిల్లీ : అల్లోపతి మందులు, వైద్యులపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. కొవిడ్ మహమ్మారి సమయంలో యోగా గురువు బాబా రాందేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారంటూ ఏడు వైద్య సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అల్లోపతి వైద్యులు, మందులతో పాటు వ్యాక్సిన్ల భద్రత, ప్రభావంపై సైతం ప్రజల మనసులో సందేహాలను వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా సంస్థలు పిటిషన్లో పేర్కొన్నాయి. ఆయన సంస్థకు చెందిన కొరోనిల్తో సహా.. పలు ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించాయి. ఈ క్రమంలో మూడో వేవ్ను దృష్టిలో పెట్టుకొని బాబా రాందేవ్ ప్రకటనలను నిలిపివేయడం అవసరమని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ జస్టిస్ హరిశంకర్ ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ డాక్టర్స్ అసోసియేషన్ పిటిషన్లపై జూన్ 3న కోర్టు సమన్లు జారీ చేసింది.