హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందగుడు పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు నిర్వహించుకొనేందుకు మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది 8 కళాశాలలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటివరకు 7 మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. మంచిర్యాల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనున్నది. ఈ ఏడాది అదనంగా ఏకంగా 1,200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.