Lok Sabha Elections | పనాజీ, మే 1: సార్వత్రిక ఎన్నికల్లో గోవా ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నది. ఉన్నది రెండు స్థానాలే అయినా రెండు పార్టీలూ గోవాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో నార్త్ గోవా స్థానంలో బీజేపీ గెలవగా, సౌత్ గోవాను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈసారి రెండు స్థానాలపై రెండు పార్టీలూ కన్నేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నమ్మకంగా ఉండగా, ప్రధాని మోదీ చరిష్మాతో ఈసారి రెండు సీట్లూ తమవేనని బీజేపీ భరోసా పెట్టుకున్నది.
ఉత్తర గోవా స్థానం నుంచి బీజేపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున రమాకాంత్ ఖలప్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి శ్రీపాద్ నాయక్ ఇప్పటికే ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 1999 నుంచి ఆయనే ఎంపీగా ఉన్నారు. ఆరోసారి కూడా విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు. ఆయనకు రమాకాంత్ ఖలప్ గట్టి పోటీ ఇస్తున్నారు. రెవల్యూషనరీ గోవన్స్ పార్టీ(ఆర్జీపీ) తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే మనోజ్ పరాబ్ కూడా భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణ గోవాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. ఈ సారి ఇక్కడ బీజేపీ తరపున వ్యాపారవేత్త పల్లవి డెంపో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున మాజీ నేవి అధికారి కెప్టెన్ విరియాటో ఫెర్నాండేజ్ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉన్నది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, హామీలు నిలబెట్టుకోకపోవడంతో ప్రజల్లోని అసంతృప్తి తమకు కలిసొస్తుందని, రెండు స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీతో స్నేహం కూడా కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే, రెవల్యూషనరీ గోవన్స్ పార్టీ చీల్చే ఓట్ల ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలకు నష్టం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, బీజేపీ పూర్తిగా మోదీ చరిష్మాపైనే ఆధారపడింది. సర్వేలు కూడా గోవాలో బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉన్నదని చెప్తున్నాయి.