వడ్డేపల్లి : పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం లోని పాలిటెక్నిక్ ( Polytechnic students ) కళాశాల ఎదుట పీడీఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు హలీం పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.97 కారణంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి ( SHAKTI ) వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం, వాటిని యంగ్ ఇండియా స్కిల్తో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య భవిష్యత్తుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. పాలిటెక్నిక్ విద్య అనేది సాధారణ స్కిల్ ట్రైనింగ్ కోర్సు కాదని, ఇది ప్రత్యేకమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అని వెల్లడించారు.
మూడు సంవత్సరాల డిప్లొమా విద్య ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతున్నారని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుత టెక్నికల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు వెంకటేష్, దానయ్య, చార్లెస్ ముదిరాజ్, పృద్వి, వీరేష్, వికాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు .