సిద్దిపేట : అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి (పీడీఎస్) పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా 250 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, వాటిని పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు యత్నిస్తున్నారన్నా పక్కా సమాచారం మేరకు భూంపల్లి శివారులోని శివ రైస్మిల్లుపై టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్, సీసీఐ సీఐ నరేశ్, సిబ్బంది నవీన్, నర్సింలు, శివకుమార్, రామ్, సాయి, అశోక్, అమృత్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 250 క్వింటాళ్ల రైస్ను గుర్తించి సీజ్ చేశారు. కేసును పోలీసులకు అప్పగించగా.. ఎస్ఐ సర్ధార్ జమాల్ కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్ పేదల ప్రజల గురించి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారస్తులు ప్రజల నుంచి అక్రమంగా కొనుగోలు చేసి, ఆ బియ్యాన్ని పాలిష్ చేసి ఎక్కువ ధరలకు మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారిపై నిఘా పెంచామన్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం కొనుగోలు చేసిన, ఇతరులకు అమ్మినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 7901100100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.