హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ వంటి రాష్ట్రంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ కేంద్రం కొర్రీలు పెడుతున్నది. వరి సాగు తగ్గించాలంటూ రాష్ర్టాలకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా అయోమయానికి గురైన రైతులు వరిసాగు నుంచి దూరం జరుగుతున్నారు. ఈ వానకాలంలో సీజన్లో వారం కిందటి వరకు దేశవ్యాప్తంగా 87 లక్షల ఎకరాలకుపైగా వరి సాగు తగ్గింది. బీజేపీ సర్కారు వరిసాగుపై పూటకో మాట మాట్లాడడం, వరి సాగు నియంత్రించేలా చర్యలు తీసుకోవడమే తగ్గుదలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలం సీజన్తో పోల్చితే దేశవ్యాప్తంగా 87.48 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. గతేడాది ఇదే సమయానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో 2.67 కోట్ల ఎకరాల్లో వరి సాగవగా, ఇప్పుడు అది 2.32 కోట్ల ఎకరాలకే పరిమితమైంది.
అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 26.23 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. ఉత్తరప్రదేశ్లో 16.50 లక్షల ఎకరాలు, బీహార్లో 13.85 లక్షల ఎకరాలు, తెలంగాణలో 8.71 లక్షల ఎకరాలు, ఛత్తీస్గఢ్లో 5.85 లక్షల ఎకరాలు, ఒడిశాలో 6.42 ఎకరాల్లో వరి నాట్లు బంద్ అయ్యాయి. ఉత్తర భారతంలో వానకా లం సీజన్ వరి నాట్లు దాదాపుగా పూర్తయ్యా యి. దక్షిణ భారతంలో తెలంగాణతో పాటు ఒకట్రెండు రాష్ర్టాల్లో కొంత వరకు వరి సాగు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిరుటితో పోల్చితే వరిసాగు తగ్గడం ఖాయమని, ఇది కోటి ఎకరాలకు చేరుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర పంటలదీ అదే పరిస్థితి
వ్యవసాయపై కేంద్రం గందరగోళ విధానాలతో వరితోపాటు మిగతా పంటలూ అంతం త మాత్రంగానే సాగవుతున్నాయి. కంది సాగు గతేడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 1.03 కోట్ల ఎకరాల్లో సాగవగా, ప్రస్తుతం 89.19 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నిరుటితో పోల్చితే 13.93 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిం ది. మక్కజొన్న 8.47 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 3.91 లక్షల ఎకరాల్లో తక్కువగా సాగైంది.
తగ్గుతున్న నిల్వలు
కేంద్రం గందరగోళ విధానాలతో వ్యవసాయరంగం సంక్షోభంలోకి కూరుకుపోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. బఫర్స్టాక్స్ కూడా తగ్గిపోతున్నాయని కేంద్రం ఇటీవల పార్లమెంట్లో చెప్పిన వివరాలు స్పష్టంచేస్తున్నాయి. 2020-21లో 5.69 కోట్ల టన్నుల ఆహార ధాన్యా ల బఫర్స్టాక్గా ఉండగా, 2021-22లో 5.64 కోట్లకు తగ్గింది. 2022-23 నాటికి మరింత తగ్గి 5.13 కోట్లకు తగ్గింది. కరువు, యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిల్వ ఉంచే బఫర్స్టాక్ను భర్తీ చేయకపోవటం ఆందోళనకరంగా మారింది. గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడితే అన్నం పెట్టే స్థోమత ఏ దేశానికీ ఉండదు. కేంద్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.